మామిళ్లగూడెం, మార్చి 15: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు హెచ్చరించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆటో డ్రైవర్లు, సంఘాల నాయకులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్, పాత బస్టాండ్, వైరా రోడ్డు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, పోలీసులకు సహకరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు.
ప్రయాణికులను పరిమితికి మించి ఎకించవద్దని, వారితో మర్యాదగా మెలగాలని, అతి వేగంతో నడపొద్దని, ఎక్కడపడితే అక్కడ ఆపొద్దని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అకతాయిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లంతా తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్-ఆర్సీ ఉంచుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి ప్రమాదాల్లో ఎక్కువగా ఆటోల కారణంగానే జరిగాయని చెప్పారు. ట్రాఫిక్ సీఐ మోహన్బాబు, ఎస్సైలు రవి, వెంకన్న, ఆర్ఎస్సై సాగర్ పాల్గొన్నారు.