పుట్టుకతోనే అవయవ లోపం.. కాలు తీసి కాలు ముందుకు వేయలేక అవస్థలు పడుతున్న దివ్యాంగులు. పిల్లలున్నా పట్టించుకోని.. అండా ఆదెరువు లేని పండుటాకులు. వితంతువులు, బోదకాలు బాధితులు, వయసుడిగిన గీత కార్మికులు, ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆసరా పథకంతో నెలనెలా పింఛన్లు అందిస్తూ వారి అవసరాలు తీరుస్తోంది. గత ప్రభుత్వాలు ఏళ్లతరబడి పాలించినా వీరి పింఛన్లు పెంచాలని ఏనాడూ ఆలోచించిన దాఖలాలు లేవు. పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ కొంత మొత్తంలో ఉన్న పింఛన్ను పెంచుకుంటూ లబ్ధిదారులు పొదుపు చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు. ఖమ్మం నగరం తర్వాత అత్యధిక పింఛన్లు రూరల్ మండలంలోని లబ్ధిదారులు పొందుతున్నారంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతున్నట్లు లెక్క. ఇదంతా సీఎం కేసీఆర్ పాలనలో.. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైంది అంటూ పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నారు.
-ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 22
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 22 : అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి.. పకడ్బందీగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ పథకంతో అనేక మంది లబ్ధిదారులకు భరోసా కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులకు నామమాత్రపు పింఛన్లు ఇవ్వడంతో అవి ఎటూ సరిపోక ఇన్నాళ్లూ అవస్థలు పడ్డారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ సమస్యలతో ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పింఛన్ సొమ్మును అంచెలంచెలుగా పెంచుతూ లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. దివ్యాంగులకు రూ.4వేల చొప్పున, ఇతర పింఛన్దారులకు ప్రభుత్వం నెలకు రూ.2వేల చొప్పున అందిస్తున్నారు. దీంతో మండలంలోని 28 గ్రామాల్లో రికార్డు స్థాయిలో 11,356 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. కొద్ది నెలల నుంచి దివ్యాంగులకు పెంచిన రూ.4,016 సొమ్మును సైతం ప్రభుత్వం అందజేస్తున్నది. నెలనెలా ఠంఛన్గా ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుండడంతో అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు మందులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. ఎవరిపై ఆధారపడకుండా పింఛన్తోనే జీవితాలను వెళ్లదీస్తున్నామని పండుటాకులు చెబుతున్నారు. ఎంతో దూర దృష్టితో ఆలోచించే సీఎం కేసీఆర్ మా ఇబ్బందులను ఆలకించి నెలనెలా పింఛన్ సొమ్ము పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అంటున్నారు. జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత అత్యధిక మంది పింఛన్లు పొందుతున్నది రూరల్ మండలంలోనే.
మండలంలో మొత్తం 11,356 మంది లబ్ధిదారులు నెలనెలా పింఛన్ పొందుతున్నారు. గ్రామాలవారీగా పరిశీలిస్తే.. ఆరెకోడు మండలంలో 284 మంది లబ్ధిదారులు ఉండగా, ఆరెకోడు తండాలో 82 మంది, ఆరెంపుల 339, బారుగూడెం 129, చింతపల్లి 282, ఏదులాపురం 973, గొల్లగూడెం 130, గోళ్లపాడు 543, గుదిమళ్ల 664, గూడూరుపాడు 217, గుర్రాలపాడు 153, కాచిరాజుగూడెం 332, కొండాపురం 321, యం వెంకటాయపాలెంలో 702 మంది లబ్ధిదారులు ఉన్నారు. మద్దులపల్లి 264, మంగళగూడెం 465, ముత్తగూడెం 574, పల్లెగూడెం 318, పెద్దతండా 1,050, పోలెపల్లి 547, పొలిశెట్టిగూడెం 236, పొన్నెకల్ 303, సీతారాంపురం(కస్నాతండా) 170, తల్లంపాడు 733, తనగంపాడు 183, తెల్దారుపల్లి 683, తీర్ధాల 264, వెంకటగిరి గ్రామంలో 415 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. కాగా.. పెద్దతండా పంచాయతీ పరిధిలోనే వెయ్యి మంది లబ్ధిదారులు ఉన్నారు.
మండంలోని 11,356 మంది పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2,74,78,016 పంపిణీ చేస్తున్నది. దివ్యాంగులకు గత నెల నుంచి రూ.4వేల చొప్పున అందిస్తుండగా.. మిగిలిన పింఛన్దారులకు నెలనెలా రూ.2,016 చొప్పున అందిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,92,119 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 30,383 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాత మండల స్థాయిలో పోల్చుకుంటే రూరల్ మండలంలో 11,356 మంది లబ్ధిదారులు ఉండడం విశేషం. మూడో స్థానంలో తిరుమలాయపాలెం, నాల్గవ స్థానంలో ముదిగొండ, ఐదవ స్థానంలో కూసుమంచి మండలం ఉంది. తొలి ఐదు స్థానాల్లో మూడు మండలాలు పాలేరు నియోజకవర్గంలోనే ఉండడం విశేషం. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి ప్రతి నెల 39,702 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు.
మొత్తం పింఛన్దారులు : 11,356
ప్రతినెల ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు : రూ.2.74కోట్లు
వృద్ధాప్య పింఛన్దారులు : 3,990
వితంతువులు : 4,288
దివ్యాంగులు : 2,180
గీత కార్మికులు : 270
వీవర్స్ : 81
ఒంటరి మహిళలు : 547
సీఎం కేసీఆర్కు దివ్యాంగుల పక్షపాతి కావడం వల్ల మాకు నెలనెలా రూ.4వేల పింఛన్ అందుతున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా నాకు ఎంతో ప్రయోజనం కలిగింది. ఇద్దరు పిల్లలు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వారు ఇచ్చే డబ్బులు చార్జీలు, చిన్న చిన్న అవసరాలకు సరిపోతున్నాయి. ఇంట్లో కిరాణ, ఇతర అవసరాలకు నా పింఛన్ డబ్బులు పనికొస్తున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-నారపాటి మల్లయ్య, దివ్యాంగుల పింఛన్దారుడు, ఏదులాపురం
ఎన్నో ఏళ్ల నుంచి బీపీ, షుగర్తోపాటు కిడ్నీ సమస్య కూడా ఉంది. దీంతో ప్రతి నెల మందులు వాడకం తప్పడం లేదు. నాకు ప్రతి నెల సర్కార్ రూ.2వేల పింఛన్ ఇస్తున్నది. ఆ డబ్బులతో అవసరమైన మందులు కొంటున్నాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు. వారికి పెళ్లిళ్లు చేసే సరికి పూర్తిగా వెనుకబడి పోయాను. పింఛన్ డబ్బులు దాచుకున్నట్లుగానే ప్రతి నెలా ఇస్తున్నారు. సర్కారు సాయం ఎప్పటికీ మరువలేను.
మాది నిరుపేద కుటుంబం. పదేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. అప్పటి నుంచి రెండో కొడుకు దగ్గర ఉంటున్నా. కొడుకు కార్పెంటర్గా పని చేస్తూ పిల్లలను చదివిస్తూ.. కోడలిని, నన్ను చూసుకుంటున్నాడు. అప్పట్లో నెలకు రూ.200 మాత్రమే ఇచ్చే వారు. కానీ.. ఇప్పుడు నెలకు రూ.2వేల చొప్పున ఇస్తున్నారు. అందులోనే కొంత పొదుపు చేసుకుంటున్నా. పింఛన్తో నాకెంతో ధైర్యంగా ఉంది.
-రాంబాయమ్మ,వితంతు పింఛన్ లబ్ధిదారు