ఉమ్మడి పాలనలో సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు తాండవించేవి.. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో పట్టణం తిరుగులేని ప్రగతిని సాధించింది.. సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విజన్ మేరకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పట్టణంలోని ప్రతి వీధికి సీసీ రోడ్లు వచ్చాయి. క్రీడాకారుల కోసం క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ లైటింగ్తో రాత్రిళ్లు పట్టణం కళకళలా డుతున్నది.. పట్టణ ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్, ఓపెన్ జిమ్లు పట్టణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నేడు పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా పట్టణాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
– సత్తుపల్లి రూరల్, జూన్ 15
సత్తుపల్లి రూరల్, జూన్ 15: సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సత్తుపల్లి పట్టణం నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పట్టణవాసుల కోసం సీసీ రోడ్లు, క్రీడాప్రాంగణాలు, సెంట్రల్ లైటింగ్, పట్టణ ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్, ఓపెన్ జిమ్లు, పబ్లిక్ మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టణాన్ని అభివృద్ధికి ఐకాన్గా నిలిపారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణం..
సత్తుపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రి స్థానంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కంకణం కట్టుకున్నారు.ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని రాజీవ్నగర్లో రూ.13.50 లక్షలతో బస్తీ దవాఖాన అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఎన్టీఆర్ నగర్, గాంధీనగర్లో మరో రెండు బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
శరవేగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం..
పట్టణంలోని వేంసూరు రోడ్లో ప్రభుత్వం రూ.4.50 కోట్లతో వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో 108కు పైగా దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నది. మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి.
పార్క్లు.. క్రీడాప్రాంగణాలు..
పట్టణంలోని వేంసూరు రోడ్డులో అటవీశాఖ, సింగరేణి ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో 375 ఎకరాల్లో నీలాద్రి అర్బన్ పార్కు అందుబాటులోకి వచ్చింది. పార్క్లో ఉదయం సాయంత్రం పట్టణవాసులు వ్యాయామం చేస్తున్నారు. చిన్నారులు దుప్పులు, జింకలు, వివిధ రకాల పక్షులను చూసి అబ్బురపడుతున్నారు. చిల్డ్రన్ పార్కు ప్రతిరోజు పిల్లలు ఆడుకుంటూ సందడి చేస్తున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్నగర్, రాజీవ్నగర్ రూ.4 లక్షలతో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ శివారులోని జేవీఆర్ పార్కులో రూ.3 లక్షలతో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10 లక్షలతో పట్టణ ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. పార్క్లు పట్టణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో రూ.3.10 కోట్లు నిధులతో మునిసిపల్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. కార్యాలయం ఎదుట రూ.10 లక్షలతో జాతీయ చిహ్నం, మహాత్ముని విగ్రహం, రూ.12.50 లక్షలతో 100 అడుగుల జాతీయ జెండా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పోస్టాఫీస్ సెంటర్లో రూ.34 లక్షలతో అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మించింది. వెంగళరావునగర్ వద్ద రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన ‘లవ్ సత్తుపల్లి’ పార్క్ ఇప్పుడు సెల్ఫీ స్పాట్గా మారింది.
రూ.47 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు..
పట్టణంలోని 23 వార్డుల్లో సర్కార్ రూ.47 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, వేంసూరు రోడ్లో రూ.25 లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ సమీపంలోని కొమ్మేపల్లిలో రూ.1.30 కోట్లతో డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయింది.
త్వరలో చేపట్టనున్న పనులు..
ప్రస్తుతం ప్రభుత్వం పట్టణంలో రూ.2.50 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం, ఆడిటోరియం, రూ.2 కోట్లతో షాదీఖానా, రూ.4 కోట్లతో తామరచెరువు, వేశ్యకాంతల చెరువుల సుందరీకరణ, ట్యాంక్బండ్లు, రూ.13 కోట్లతో 23 వార్డుల్లో సీసీ, డ్రైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. యువతకు శిక్షణ ఇవ్వడానికి త్వరలో వివేకానంద సెంట్రల్ ఫర్ ఎక్స్లెన్స్ భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి పనులకు అధికారులు డీఎంఎఫ్టీ, టీయూ ఎఫ్ఐడీసీ, సీఎస్ఆర్, పట్టణప్రగతి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, జనరల్ ఫండ్ నిధులను వినియోగిస్తున్నారు.
నిరుపేదల ఇంటి కల సాకారం…
పట్టణంలోని వేంసూరు రోడ్తో పాటు సర్కార్ పట్టణ శివారులోని జేవీఆర్ పార్క్ సమీపంలో 146 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించింది. వేంసూరు రోడ్లో రూ.2 కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్, కల్యాణ మండప నిర్మాణానికి ఇటీవల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు.
మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయం..
సత్తుపల్లి మునిసిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణంలో మూడేళ్లలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం. పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నాం.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
మునిసిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం..
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. రానున్న రోజుల్లో పట్టణవాసులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇప్పటికే పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– కూసంపూడి మహేష్, మునిసిపల్ చైర్మన్, సత్తుపల్లి
పట్టణ రూపురేఖలు మారాయి..
సత్తుపల్లి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. స్వరాష్ట్రం వచ్చాకే ఈ మార్పు సాధ్యమైంది. సెంట్రల్ లైటింగ్తో పట్టణం రాత్రిళ్లు కళకళలాడుతున్నది. పట్టణ పార్క్లు, ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్లతో పట్టణం ఇప్పుడు ఆహ్లాదకరంగా మారింది.
– షేక్ జాన్బీ, గృహిణి, ఎన్టీఆర్నగర్, సత్తుపల్లి