ఖమ్మం, ఏప్రిల్ 16 : అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడదామని, తరిమికొడదామని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం.. ఆ తరువాత వాటికి తిలోదకాలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రి ప్రాంగణంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత ప్రచారం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన మాయమాటలను, ఆ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్న కసితో ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సమరోత్సాహంతో పని చేయాలని, ప్రజాక్షేత్రంలో సుశిక్షితులైన సైనికుల్లా కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ శ్రేణులు జిల్లాలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలనూ కలవాలని సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీ రథసారథులని, వారి కృషి వల్లనే తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని అన్నారు. కార్యకర్తలపై ఈగ వాలినా సహించేదిలేదని స్పష్టం చేశారు. అధికారం లేకపోయినా శ్రేణులకు అండగా ఉంటామని, కష్టకాలంలో వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ప్రస్తుత సమయంలో తెలంగాణ గొంతును పార్లమెంటులో వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఇక నిశ్శబ్దాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం కలిసికట్టుగా శ్రమిద్దామని అన్నారు. స్వార్థంతో కొందరు పార్టీని వీడిపోయినా మనమందరమూ ఐక్యంగా ఉన్నామని, కష్టకాలంలో పార్టీ అధినేత కేసీఆర్కు అండగా నిలబడ్డామని అన్నారు. అందుకని అందరమూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని, కేసీఆర్కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ను దూరం చేసుకున్నందుకు ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అలాగే, కేసీఆర్ను దూరం చేసుకున్నందుకు ప్రజలు కూడా బాధపడుతున్నారని అన్నారు. అందరమూ కలిసి ఐక్యంగా పనిచేసి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఖమ్మంలో నామా గెలిస్తే కేసీఆర్ ఎంతగానో సంతోషిస్తారని, మనకూ మంచి గౌరవం దకుతుందని అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ బచ్చు విజయ్కుమార్, ఖమర్, తాళ్లూరి జీవన్, మోతారపు సుధాకర్, వీరూనాయక్, కూరాకుల వలరాజు, పసుమర్తి రామ్మోహన్రావు, రుద్రగాని శ్రీదేవి, జ్యోతిరెడ్డి, గాదె అమృత, ప్రసన్న, నాగండ్ల జ్యోతి, డోలే లక్ష్మి, సరిపూడి సతీశ్, రుద్ర ప్రదీప్, తోట ఉమారాణి, జశ్వంత్, రవి, మాటేటి అరుణ, ధనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నామాను, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజును మాజీ మంత్రి అజయ్కుమార్ శాలువాతో సత్కరించారు. అలాగే, వద్దిరాజు రవిచంద్ర మరోసారి రాజ్యసభకు ఎన్నికైనందుకుగాను ఎంపీ నామాతో కలిసి ఆయనకు మిఠాయి తినిపించి విషెస్ చెప్పారు.