వేంసూరు, జూలై 17 : వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అమ్మపాలెం నుంచి వెంకటాపురం వరకు వెయ్యి ట్రాక్టర్లు, 500 బైక్లతో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ర్యాలీ అగ్రభాగాన పాల్గొని రైతులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నూతనోత్తేజాన్ని నింపారు. అనంతరం వెంకటాపురంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నదని, వారి పాలనలో ఏనాడూ పగటిపూట కరెంట్ ఉండేది కాదని, రాత్రిపూట రైతులు పంటచేల వద్ద జాగారం చేసే పరిస్థితి ఉండేదన్నారు.
ప్రభుత్వాల మధ్య ఒప్పందంతో కరెంట్ను కొనుగోలు చేస్తే.. ఎలా అవినీతి జరిగిందో తెలుపలేని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.10,500కోట్లు ఖర్చు చేస్తున్నదని, విద్యుత్ రంగానికి ఏటా బడ్జెట్లో రూ.38వేల కోట్లు కేటాయిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో కేంద్రం చేతులెత్తితే సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటుంటే.. కాంగ్రెస్ ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు మూడు గంటల కరెంట్ కావాలా.. మూడు పంటల బీఆర్ఎస్ పార్టీ కావాలో తేల్చుకొని.. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.