కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 23 : ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీని పూర్తి చేసిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ‘ఇంటర్ తర్వాత ఏం చదవాలి?’ అనే అంశంపై ‘లక్ష్యం 2024’ పేరిట ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం కృష్ణవేణి జూనియర్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కృష్ణవేణి కాలేజీలో చదవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కాలేజీకి రాష్ట్రస్థాయిలో మంచి పేరు ఉందని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ.. విద్యార్థులు అత్యున్నత స్థానాలు పొందేందుకు దోహదపడుతోందని అన్నారు.
ఇలాంటి కళాశాలలో చేరడం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని అన్నారు. సాధారణ స్థాయి విద్యార్థులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం ఈ కాలేజీ గొప్పతనమని అన్నారు. మంచి క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించేందుకు దోహదపడుతున్న అధ్యాపక సిబ్బందిని, యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని అన్నారు. అయితే, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకోబోతున్న విద్యార్థులు కనీసం మూడు ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. ఏ యూనివర్సిటీలో చేరాలో నిశితంగా పరిశీలించి పది యూనివర్సిటీలను ఎంచుకోవాలని, అందులో టాప్ 3 యూనివర్సిటీలను ఎంచుకొని మీకు నచ్చిన వాటిలో చేరాలని సూచించారు. తద్వారా తమ భవిష్యత్తును నిర్దేశించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే, డ్యూయల్ డిగ్రీతో కూడా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, ఆన్లైన్లో ఒక డిగ్రీ చేస్తూనే ఆఫ్లైన్లో మరొక డిగ్రీ పట్టా సాధించవచ్చని అన్నారు.
95 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీలో ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య, మంచి కెరీర్ కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం లక్కీడ్రా తీసి విద్యార్థినులు, టాపర్లకు ప్రముఖులు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి మూర్తి, హెచ్ఎస్ఆర్ మూర్తి, కృష్ణవేణి జూనియర్ కాలేజీ డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు, ‘నమస్తే తెలంగాణ’ ఖమ్మం యూనిట్ బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, అడ్వైర్టెజ్మెంట్ డిప్యూటీ మేనేజర్ బోయిన శేఖర్బాబు, స్టాఫ్ రిపోర్టర్ కాగితపు వెంకటేశ్వరరావు, కృష్ణవేణి కాలేజీ, కేఎల్ వర్సిటీల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యా సమాచారానికి సంబంధించిన అవగాహన సదస్సులు గతంలో మెట్రో పాలిటన్ సిటీల్లో నిర్వహించేవారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు కేవలం వార్తలనే కాకుండా.. విద్య, ఉద్యోగ సమాచారాలను కూడా అందిస్తున్నాయి. అందులో భాగంగానే మా సంస్థలు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా లక్ష్యం-2024 పేరుతో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై సదస్సు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి.
గతంలో ఇలాంటి సెమినార్లు మెట్రో పాలిటన్ సిటీలు, పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే జరిగేవి. కానీ.. కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో వినూత్నంగా మారుమూల జిల్లాల్లో కూడా ఇలాంటి సదస్సులు నిర్వహించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం పూనుకోవడం మంచి పరిణామం. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించి ఉజ్వల భవిష్యత్తుకు తీసుకెళ్లే విద్యా సంస్థల్లో చేరితే మంచి అవకాశాలు లభిస్తాయి. లక్ష్యం-2024 సదస్సులు మున్ముందు కూడా నిర్వహిస్తే మరింత బాగుంటుంది.
నేను బీటెక్ సివిల్, మెకానికల్ కోర్సులు చేయాలనుకుంటున్నా. ఈ కోర్సుల్లో అమ్మాయిలు చేరితే భవిష్యత్తు ఉండదని, చాలా కష్టమని అంటున్నారు. వీటిపై వివరణ కావాలని సదస్సు తర్వాత నేను వేదికపై మాట్లాడిన. నా సందేహాలను కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ వారు నిర్వహించిన లక్ష్యం-2024 ద్వారా తెలుసుకున్నా. ఎలా చదవాలి, ఎలాంటి కోర్సు తీసుకోవాలో తెలిసింది.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన లక్ష్యం-2024 సెమినార్ ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. యూనివర్సిటీ డైరెక్టర్ వివరించిన విధానం మాకు బాగా నచ్చింది. ఇంటర్ పూర్తయిన తర్వాత పై చదువుల కోసం ఏ విధంగా ఆలోచన చేయాలనే అంశాలు బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడతాయి.
బీటెక్లో ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఎలాంటి కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలనే అంశాలపై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ-నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా సదస్సు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణవేణి కాలేజీలో చేరడం మీ అదృష్టం. నాణ్యతతో కూడిన విద్య ఇక్కడ దొరుకుతోంది. మారుమూల ప్రాంతాల్లో కృష్ణవేణి కాలేజీ యాజమాన్యం నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించడం అభినందనీయం. కాలేజీలో మొదటి సంవత్సరంలో చదివిన విద్యార్థులకు 60 మందికి 400 మార్కులకు పైగా సాధించడం గొప్ప విషయం. ప్రతీ ఏడాది బైపీసీ నుంచి ఆరు, ఏడు మెడికల్ సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. విద్యార్థులు ఇంటర్లోనే ప్రణాళికతో చదివి ఉత్తమ కోర్సుల్లో చేరాలి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అందించే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి.