ఖమ్మం వ్యవసాయం, మే 26 : మరికొద్దిరోజుల్లో వానకాలం సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ ఎట్టకేలకు సాగు ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి సుమారుగా 7,03,676 ఎకరాల్లో రైతులు సాగుచేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. వీటిలో వరి 2,83,943 ఎకరాలు, మక్కసాగు 3,374 ఎకరాలు, కంది 1,005 ఎకరాలు, పత్తి 2,01,834 ఎకరాలు, పెసర 15,357 ఎకరాలు, మినుము 436 ఎకరాలు, వేరుశనగ 270 ఎకరాలు, చెరుకు 2,432 ఎకరాలు, మిర్చి 88,906 ఎకరాలతోపాటు ఇతర పంటలు మరో 1,06,119 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోవాలని మార్క్ఫెడ్, టీ సీడ్స్ కార్పొరేషన్కు ఇండెంట్లను పంపించారు.
ఈ వానకాలం సీజన్లో సాగు జరిగేందుకు వీలుగా అవసరమైన విత్తనాలకు సంబంధించి సైతం జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు విత్తన ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన విత్తన ఇండెంట్ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్తోపాటు ఆయా విత్తన డీలర్లకు సైతం అందజేశారు. వరి 70,986 క్వింటాళ్లు, మక్క విత్తనాలు 135 క్వింటాళ్లు, కంది 80 క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 5.50 లక్షల ప్యాకెట్లు, పెసర 1,229 క్వింటాల్, మినుము 35 క్వింటాళ్లు, వేరుశనగ 243 క్వింటాళ్లు, మిరప 90 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.