ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 27 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లాలో 70, భద్రాద్రి కొత్తగూడె జిల్లాలో 36 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. నిమిషం నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో రెగ్యులర్ విద్యార్థులు 16,015 మంది, ఒకేషనల్ విభాగంలో 2,466 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో రెగ్యులర్ విద్యార్థులు 15,905 మంది, ఒకేషనల్ విభాగంలో 2,192 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను 36,578 మంది రాయనున్నారు. మొత్తం 131 కళాశాలల్లో 70 కేంద్రాలకు జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థులను కేటాయించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ప్రథమ చికిత్స వంటి ఏర్పాట్లు చేసినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 3 ఫ్ల్లయింగ్ స్కాడ్స్, 10 సిట్టింగ్ స్కాడ్స్లను నియమించారు. ప్రతి ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో ఒక ఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్ లెక్చరర్ ఉన్నారు. పరీక్షల నిర్వహణ హైపవర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ, ఆర్జేడీ, డీఐఈవో, ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ లెక్చరర్ సభ్యులుగా ఉండి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. ప్రశ్నాపత్రాల పంపిణీ నుంచి విద్యార్థుల నుంచి సమాధాన పత్రాలు తీసుకునే వరకు ప్రతీది క్షుణ్ణంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగనున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం 10,200 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది శాఖాపరమైన అధికారులు, 13 మంది అదనపు పర్యవేక్షకులు విధులు నిర్వహించనున్నారు. మూడు సిట్టింగ్ స్కాడ్స్, ఐదుగురు కస్టోడియన్స్ను నియమించారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. గట్టి బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 97046 61714, 99469 13069 నంబర్లలో సంప్రదించవచ్చు.
విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దు. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. 30 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సెంటర్ లోకేటెడ్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాలను గుర్తించవచ్చు (TSBIEM సర్వీసెస్). నేరుగా ఇంటర్ విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని, ప్రిన్సిపాల్ ధ్రువీకరణ లేకపోయినా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే డీఐఈవో కంట్రోల్ రూమ్ 99489 04023కు ఫిర్యాదు చేయొచ్చు.