‘తెల్లనివన్నీ పాలు కాదు’ అన్నట్లే మనం మార్కెట్లలో కొనే పాలన్నీ స్వచ్ఛమైన పాలు కావు.. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా డెయిరీ నిర్వాహకులు రసాయనాలు కలుపుతారనేది జగమెరిగిన సత్యం.. కానీ విజయ డెయిరీ నుంచి బహిరంగ మార్కెట్లోకి వచ్చే పాలు స్వచ్ఛమైనవి. శాస్త్రీయంగా ఈ విషయం నిరూపితమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ డెయిరీలు ప్రైవేటు డెయిరీలకూ ఆదర్శం. ఇదే కోవలో భద్రాద్రి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి డెయిరీ ఇంతింతై వటుడింతై.. అన్నట్లు ఎదుగుతున్నది.. పాడి పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.. పాడిరైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నది. 2019 వరకు 193 మంది పాడి రైతులకు రాయితీపై గేదెలు, ఆవులు అందించింది. ప్రైవేటు డెయిరీలకు దీటుగా మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. విజయ డెయిరీ ప్రస్థానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిఒక్కరూ రోజుకు 200 మి.లీ పాలైనా తాగాలని సైంటిస్టులు, నూట్రిషనిస్టులు సూచిస్తుంటారు. మనం తాగే పాలన్నీ మంచివా..? స్వచ్ఛమైనవా..? అంటే కానే కాదు. కానీ ‘మా సంస్థ నుంచి బహిరంగ మార్కెట్లోకి వచ్చే పాలు స్వచ్ఛమైనవి..’ అని ఘంటాపథంగా చెప్తున్నారు లక్ష్మీదేవిపల్లి పరిధిలోని విజయ డెయిరీ నిర్వాహకులు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ డెయిరీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మంది పాడి రైతులు, సిబ్బంది ఉపాధి పొందుతున్నారు.
గ్రామాల్లో నివసించే వారిలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఆ తర్వాతి స్థానం పాడి పరిశ్రమది. పాడిరైతులను ప్రోత్సహించేందుకు విజయ డెయిరీ యాజమాన్యం ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నది. 2019 వరకు 193 మంది రైతులకు రాయితీపై గేదెలు, ఆవులు అందించింది. ప్రైవేటు డెయిరీలకు దీటుగా మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పాడి రైతుకు ఒక లీటర్కు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నది.
డెయిరీ పరిధిలో జిల్లా కేంద్రంతో పాటు ఇల్లెందు, కొత్తగూడెం డివిజన్ల పరిధిలో 60 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి సిబ్బంది పాడి రైతుల నుంచి సుమారు 3 వేల లీటర్ల పాలు సేకరిస్తారు. స్థానికంగా కొన్ని లీటర్లు విక్రయిస్తాయి. మరికొన్ని లీటర్లను ఆటోల ద్వారా మిల్క్సెంటర్లకు తరలిస్తారు. ప్రస్తుతం డెయిరీ పరిధిలో ఒక లీటర్ పాల ధర రూ.80 ఉన్నది. యాజమాన్యం పాడి రైతులకు అదనంగా మరో రూ.2 ఇస్తుంది. అలాగే నాలుగు శాతం ప్రోత్సహకాలనూ అందిస్తుంది.
పాడి రైతులు పశువులు కొనుగోలు చేసేందుకు డెయిరీ యాజమాన్యం రూ.వెయ్యి రాయితీ ఇస్తున్నది. జీవాల బీమాకు రూ.వెయ్యి, కృత్రిమ గర్భాధారణ సదుపాయం. అధిక శాతం ఎస్ఎస్ఎఫ్ కలిగిన పాలకు ప్రీమియం ధర కల్పిస్తున్నది. పాడి రైతుల ఇంట పెండ్లి జరిగితే ఆ వేడుకకు యాజమాన్యం ‘విజయ పెండ్లి కానుక’ పథకం ద్వారా రూ.5 వేలను కానుకగా ఇస్తున్నది. బల్క్ మిల్క్ సెంటర్లలో నాణ్యమైన ఎక్కువ పాలు పోసే పాడిరైతులకు రూ.2,116 నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. 1,500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే రైతులకు రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు, పాల క్యాన్లు, విద్యుత్, దాణా, మినరల్ మిక్చర్ పంపిణీ చేస్తున్నది. ల్యాబ్లో రిజిస్టర్ అయిన రైతులకు మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. ఏ కారణంతోనైనా పాడి రైతు మృతిచెందితే డెయిరీ యాజమాన్యం అంతిమ సంస్కారాలకు రూ. 5 వేల సాయం అందిస్తుంది.
పాలకు రోజు రోజుకు డిమాండ్ పెరగడంతో ఎక్కువ మంది జీవాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా పరిధిలోని ఎంపీ బంజర, రెడ్డిపాలెం, లక్ష్మీపురం, సుజాతనగర్, కొత్తగూడెం వంటి ప్రాంతాల నుంచి డెయిరీ యాజమాన్యం ఎక్కువగా పాలను సేకరిస్తున్నది. అత్యధికంగా ఎంపీ బంజర నుంచి ఓ పాడి రైతు 500 లీటర్ల పాలను కేంద్రానికి తరలిస్తున్నారు. పశుపోషణ కోసం కొందరు పాడి రైతులు పిల్లిపెసర, జనుము వంటి పంటలనూ పండిస్తున్నారు.
మా సంస్థ నుంచి ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నాం. పాలను నిల్వ చేసేందుకు మేము ఎలాంటి రసాయనాలను వినియోగించడం లేదు. మా డెయిరీ పాలు కేవలం ఒకరోజు మాత్ర మే నిల్వ ఉంటాయి. ఇతర కంపెనీల పాలు అలా కాదు. పాల ఉత్పత్తులు మరింత పెంచేందుకు గ్రామస్థాయిలో మరిన్ని సేకరణ కేంద్రాలు పెడుతున్నాం. మాకు కొత్తగూడెం, ఇల్లెందు డివిజన్ల పరిధిలో ఎక్కువ సేకరణ కేంద్రాలు ఉన్నాయి.
పాడి రైతులు పశువుల నుంచి తీసిన పాలను స్థానికులు కొనకపోయినా డెయిరీ యాజమాన్యం పాలను తీసుకుంటుంది. యాజమాన్యం మంచి ధర కూడా ఇస్తున్నది. ఉదయం ఎనిమిది గంటల కల్లా కేంద్రానికి తీసుకువస్తే వెంటనే పరీక్ష చేసి తీసుకుంటున్నారు.