టేకులపల్లి, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నసిస్ హబ్లో 56 రకాల రక్త పరీక్షలు ఉచితమని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్థానిక డాక్టర్ నరేశ్, వైద్య సిబ్బందితో కలిసి ఆసు పత్రి లోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు, రక్త పరీక్ష కేంద్రాన్ని, టీకాల కోసం ఏర్పాటు చేసిన గదిని, కరోనా వార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టిక, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీల్లో సేకరిస్తున్న రక్తనమూనాలను జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నసిస్ హబ్కు పంపించాలని సూచించారు. మండలంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంచాలని, గ్రామాల్లో ముందుగానే గర్భిణులను గుర్తించి ఆశ కార్యకర్తల ద్వారా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పీహెచ్సీలో సిబ్బంది కొరత గురించి వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని ఆయన సమాధానమిచ్చారు. మెరుగైన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వైద్యశాలలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ నరేశ్, సిబ్బంది సీతమ్మ, మంగీలాల్, లలిత పాల్గొన్నారు.