భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ): గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా పరుగులు పెడుతున్నాయన్నారు. యావత్ దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అనంతరం సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పట్టాలు అందిన తర్వాత పోడు రైతులకూ రైతుబంధు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా పరుగులు పెడుతున్నాయన్నారు. యావత్ దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. భూక్రయ విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారని, పోర్టల్ తీసేస్తే మళ్లీ పాత సమస్యలే పునరావృతం అవుతాయన్నారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నదన్నారు. రూ.13 వేల కోట్లతో పనులు చేయిస్తున్నదన్నారు. పనులు ఇప్పటికే చివరి దశకు వచ్చాయన్నారు. మరోవైపు దుమ్ముగూడెం వద్ద సీతమ్మ బరాజ్ నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం చెరువుల్లోకి పూర్తి రాయితీతో చేప పిల్లలు వదిలామన్నారు. ఈ నెల చివరి కల్లా రెండో విడత గొర్రెలు పంపిణీ చేపడతామన్నారు. అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం వర్తించిందన్నారు. 21 రోజులు పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ జోగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.