రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యలకు చెక్
సులభంగా తంబ్, ఐరిస్ తీసుకునేందుకు నూతన ‘ఈ-పాస్లు’
ఇప్పటికే ఈ విధానంపై డీలర్లకు శిక్షణ పూర్తి
తొలగనున్న రేషన్ కార్డుదారుల ఇబ్బందులు
వచ్చే నెల నుంచి కొత్త మిషన్ల ద్వారా పంపిణీ
ప్రజాపంపిణీ వ్యవస్థ నిరుపేదలకు అతి చేరువగా ఉండే ప్రభుత్వశాఖ.. దారిద్య్రరేఖకు దిగువన జీవి స్తున్న వారికి రేషన్ డీలర్ల ద్వారా సకాలంలో సరుకులు అందించడం ఈ శాఖ లక్ష్యం.. కానీ దుకా ణాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగా కార్డుదారులకు ఈ-పాస్ ద్వారా రేషన్ సక్ర మంగా అందడం లేదు.. ముఖ్యంగా సిగ్నల్స్ అందకపోవడంతో లబ్ధిదారుల తంబ్, ఐరిస్ తీసు కోవడం డీలర్లకు కష్టతరంగా మారింది. ఈ సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన విధా నంలో పంపిణీ చేయాలని నిశ్చయించింది.. దుకాణాల్లో 4జీ సౌకర్యం కల్పించి కొత్త ఈపాస్ యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.. వీటి వినియోగంపై ఇప్పటికే డీలర్లకు శిక్షణ పూర్తయింది.. వచ్చే నెల నుంచి కొత్త యంత్రాలతోనే సరుకుల పంపిణీ జరుగనున్నది.
ఖమ్మం జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సెల్ (ఈ పాస్) ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నది. ఈ పద్ధతిలో డీలర్లు సెల్ సిగ్నల్స్ అందకపోవడం, తంబ్, ఐరీస్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా కార్డుదారులు ఒకటికి రెండుసార్లు రేషన్ షాపునకు రావాల్సి వస్తున్నది. దుకాణాలు కాస్త దూరంలో ఉంటే రవాణా చార్జీలు వృథా అవుతున్నాయి. దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి వస్తే తంబ్, ఐరిస్ వంటి సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బ్లూటూత్, వై ఫైతో ఇంటర్నెట్ సజావుగా అందుతుంది. దీంతో లబ్ధిదారులకు సత్వరం సరుకులు అందే అవకాశం ఉంటుంది. వచ్చే నెల నుంచి నూతన మిషన్లతో డీలర్లు సరుకులు పంపిణీ చేయనున్నారు.
ఇబ్బందులు ఇలా..
రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ మిషన్కు వై ఫై ద్వారా బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. మారుమూల గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో తంబ్, ఐరిస్ తీసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఐరిస్ మిషన్లూ పనిచేయడం లేదు. ఈ ఇబ్బందులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో 4జీ సదుపాయం ఉన్న ఈ పాస్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నది.
ఉమ్మడి జిల్లాలో 1,112 రేషన్ దుకాణాలు..
ఉమ్మడి జిల్లాలో 1,112 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 669 ఉండగా కొత్తగూడెంలో 443 ఉన్నాయి. మొత్తం 6,71,339 రేషన్ కార్డుదారులున్నాయి. లబ్ధిదారుల్లో అన్నపూర్ణ కార్డులు రెండు, ఆహార భద్రత కార్డులు 6,27,178, అంత్యోదయ కార్డులు 17,573 ఉన్నాయి. వీరికి నెలకు 12, 49,381 మెట్రిక్ టన్నుల బియ్యం అందుతున్నది. ఖమ్మం జిల్లాలో 669 రేషన్ షాపులు ఉండగా వీటి ద్వారా 3,95,841 ఆహార భద్రత కార్డుదారుల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెలకు 7,250 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నది. వీటిలో 26,582 అంత్యోదయ కార్డుదారుల్లో ఒక్కో కుటుంబానికి 35 కిలోల చొప్పున 9.30 టన్నుల బియ్యం, రెండు అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున 5 క్వింటాళ్ల బియ్యం అందుతున్నది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద బియ్యం అందిస్తున్నది. ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందుతున్నది. ఈ నెల 27వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది.
రేషన్ డీలర్లకు శిక్షణ..
నూతన ఈ-పాస్ మిషన్ల వినియోగంపై శనివారం ఖమ్మం నగరంలోని డీపీఆర్సీ భవనంలో రేషన్ డీలర్లకు శిక్షణ పూర్తయింది. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, చింతకాని, రఘునాథపాలెం,కొణిజర్ల, ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాలలకు చెందిన డీలర్లకు శిక్షణ ఇచ్చి నూతన ఈ- పాస్ మిషన్లు అందజేశారు. ఈ నెల 27న ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో బోనకల్, మధిర, ఎర్రుపాలెం, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, వైరా, తల్లాడ, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలలకు చెందిన రేషన్ డీలర్లకు శిక్షణ ఇచ్చి నూతన ఈ పాస్ మిషన్లు అందజేస్తారు.