Bogus Votes | వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం.. ఒకే ఇంట్లో ఆరుకు మించి ఓటర్లు ఉన్నా.. ఒకరికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నా వాటిని తొలగించే బాధ్యతను బూత్ లెవల్ ఆఫీసర్లకు అప్పగించారు. తుది ఓటర్ల జాబితా రూపొందించడంతోపాటు కొత్త ఓటర్ల నమోదు, బోగస్ ఓట్ల తొలగింపులో పార్టీల సహకారం తీసుకోవడానికి ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ ఏడాది తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలో విడుదల చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కొత్తగా జిల్లాలో 48,357 ఓట్లు పెరిగాయి. వీటితోపాటు 95 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు 8,65,888 ఉండగా.. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం 9,14,245 మంది ఉన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన, ఇంటింటి సర్వేలో అర్హులను ఓటర్ల జాబితాలో చేర్చడం, ఓటుపై అవగాహన కల్పించడం వల్ల ఓటర్ల సంఖ్య పెరిగినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. గత ఎన్నికల్లో 997 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటి సంఖ్యను 2023లో జరిగే ఎన్నికలకు 1,092కు పెంచారు.
బోగస్ ఓటర్ల తొలగింపునకు చర్యలు
బోగస్ ఓటర్ల తొలగింపును పకడ్బందీగా చేపట్టాలని, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు బోగస్ ఓట్లకు చెక్ పెట్టడంతోపాటు తుది జాబితా రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే బోగస్ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు. బూత్ లెవల్ ఆఫీసర్లు.. ఒకే కుటుంబంలో ఎక్కువగా ఓట్లు ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా రెండుచోట్ల ఓటు ఉన్నా పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటి నెంబర్తో 6 ఓట్ల్ల కంటే ఎక్కువగా ఉన్న జాబితాను బీఎల్వోలకు ఇవ్వగా.. ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఓటరు ఆ ఇంట్లో లేకున్నా లేదా అందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకపోయినా సదరు ఓటు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటున్నారు.
దీనిని జిల్లా అధికారులు ఇచ్చిన ఫార్మాట్లోనే వివరిస్తున్నారు. ఒకరికి రెండు చోట్ల ఓటు ఉంటే వారికి సమాచారం ఇచ్చి వారు కోరుకున్న చోటే ఓటును ఉంచి.. మిగిలిన ఓటును తొలగిస్తున్నారు. గతంలో తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించి ఒకవేళ అర్హత ఉంటే వారికి అన్యాయం జరగకుండా ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారు. గతంలో కొన్ని ఇళ్లలో 20 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నట్లు వెలుగులోకి రావడం, వాటిపై అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పరిశీలించాలని ఎన్నికల సంఘం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వెళ్లి మరీ ఓట్ల వివరాలను తనిఖీ చేస్తున్నారు.
జిల్లాలో పెరిగిన ఓటర్లు..
గత అసెంబ్లీ ఎన్నికల జాబితాను పరిశీలించినట్లయితే.. ఈ ఏడాది అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల జాబితా ప్రకారం జిల్లాలో 8,65,888 ఓటర్లు ఉన్నారు. అప్పుడు మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 4,39,388 మంది మహిళా ఓటర్లకు.. పురుషులు 4,26,401 మంది, ఇతరులు 99 మంది ఉన్నారు. 2023లో అధికారులు ప్రకటించిన కొత్త జాబితా ప్రకారం కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు 4,67,414 మంది ఉండగా.. పురుషులు 4,46,797 మంది, ఇతరులు 34 మంది ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల జాబితా కంటే ఈ ఏడాది జాబితాలో 65 మంది ఇతరులు తగ్గారు. గత జాబితా కంటే ఈ ఏడాది జరగబోవు ఎన్నికలకు ఓటర్ల సంఖ్య జనవరి నాటికి 48,357 పెరిగారు. ఈ సంఖ్య ఎన్నికల నాటికి మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు బోగస్ ఓటర్ల తొలగింపుపైనా దృష్టి సారించాం. గతంలో తొలగించిన ఓటర్లను కూడా తిరిగి పరిశీలించి అర్హత ఉంటే వారికి అన్యాయం జరుగకుండా జాబితాలో చేర్చుతున్నాం. రాజకీయ పార్టీల నాయకులతో ఇప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నాం. వచ్చే ఎన్నికలకు సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం.
– కర్నాటి వెంకటేశ్వర్లు, అనదపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం