బోనకల్లు, సెప్టెంబర్ 20: దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్.. ఆయా వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అందుకే ఆయా వర్గాల ప్రజలందరూ బీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారని అన్నారు. మండలంలోని కలకోట గ్రామంలో కాంగ్రెస్, సీపీఐ నుంచి 40 కుటుంబాల వారు బుధవారం జడ్పీ చైర్మన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ నాయకులు అనేక మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ వారి మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తన పదవిని కాపాడుకునేందుకే ఇటీవల పాదయాత్ర చేశారని, ఆ యాత్రలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. దళితులను దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, చేబ్రోలు మల్లికార్జునరావు, వెంగళ కనకయ్య, గద్దల వెంకటేశ్వర్లు, అబ్బూరి బాబు, షేక్ నిజాం, పెద్దప్రోలు నాగేశ్వరరావు, ఇటికాల శ్రీనివాసరావు, చావా హనుమంతరావు, కిన్నెర పాపారావు, పారా ప్రసాద్, జంగా రవికుమార్, ఉయ్యూరు రాధాకృష్ణ, తోటపల్లి జాషువా, వెంగళ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.