ఖమ్మం, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన సంగతి విదితమే. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కొనసాగింపుపై దృష్టిసారించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో లబ్ధిదారులకు చెల్లించాల్సిన పెండింగ్ నిధులు చెల్లించలేకపోతున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సగం నిధులతో యూనిట్లు స్థాపించుకున్న లబ్ధిదారులు మిగతా డబ్బుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని దళితబంధు పథకాన్ని ఆ మండలంలో ఉన్న 100 శాతం దళిత కుటుంబాలకు అమలు చేశారు. దీనిలో భాగంగా ఈ మండలంలో 3,462 మందికి దళితబంధు పథకంలో వివిధ యూనిట్లను మంజూరు చేసిన ప్రభుత్వం 60 శాతం మందికి పూర్తిస్థాయి నిధులను మంజూరు చేసి యూనిట్ల స్థాపనకు సహకారం అందించారు. ఇంకా మిగిలిన 1,486 మందికి రూ.32 కోట్ల74 లక్షల 53 వేలను చెల్లించాల్సి ఉంది.
ఈ చెల్లింపులు లబ్ధిదారులకు వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున మంజూరు చేసిన వాటిలో మధిర నియోజకవర్గ పరిధిలో ఇంకా 55 మంది లబ్ధిదారులకు రూ.75.19 లక్షలు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వైరా నియోజకవర్గ పరిధిలో ఖమ్మంజిల్లా నుంచి 83 మందికి యూనిట్లు మంజూరు చేశారు. వారిలో ఇంకా 53 మందికి రూ.38.78 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉంది. సత్తుపల్లి నియోజకవ పరిధిలో మంజూరు చేసిన 100 యూనిట్లలో మరో 17మందికి రూ.7.72 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. పాలేరు నియోజకవర్గ పరిధిలో 44 మంది లబ్ధిదారులకు రూ.86.96 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు రూ.44.21 లక్షలు పెండింగ్లో ఉన్నాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో ఫైలెట్ ప్రాజెక్టు మండలంతో కలిపి 3,945 మంది లబ్ధిదారులలో ఇంకా 1,685 మందికి వివిధ దశల్లో యూనిట్లకు సంబంధించిన నిధులు రూ.35 కోట్ల 25 లక్షల 39 వేలు వారి ఖాతాల్లో జమ చేసి ఉన్నాయి. వాటి విడుదల కోసం లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధికారులు మాత్రం ప్రస్తుతం లబ్ధిదారుల ఖాతాలో ఉన్న నిధుల విడుదలకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వస్తేనే విడుదల చేస్తామని చెబుతున్నారు. లబ్ధిదారులు వారికి మంజూరైన పది లక్షల్లో మొదటి విడతగా యూనిట్ను స్థాపించుకుని దానిని మరింత పెంచుకునేందుకు బ్యాంకుల్లో ఉంచిన యూనిట్ డబ్బులు విడుదలకాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొంతమంది లబ్ధిదారులు ఫైనాన్స్ సంస్థలు, ఇతర వాహన సంస్థల్లో వాయిదాలు కట్టేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళితబంధు లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
దళితబంధు పథకంతో చింతకాని మండలంలోని దళితులందరి తలరాతలు మారాయి. జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా పెనుమార్పులు వచ్చాయి. మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి హార్వెస్టర్ కొన్నాము. వరికోత, పెసలు, మినుముల కోత సీజన్లో యంత్రం చాలా బిజీగా ఉంటుంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన కేసీఆర్ సార్ చల్లగుండాలే. మా జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేనిది.
దళితబంధు పథకంలో అధికారులు నాకు రూ.6 లక్షల విలువైన గొర్రెల యూనిట్ మంజూరు చేశారు. కానీ ఇటీవల నా భర్త అనారోగ్యంతో మృతిచెందారు. నా భర్త బ్యాంక్ అకౌంట్లో మిగిలి ఉన్న రూ.4 లక్షలను అధికారులు ఇప్పించి మరో యూనిట్ ఏర్పాటు చేసుకునేలా నా కుటుంబానికి సహకారం అందించాలని కోరుతున్నాను.