వరండా, చెట్ల కింద విద్యా బోధనకు కాలం చెల్లింది. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల లేమి వంటి అవస్థలు దూరంకానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ‘మన ఊరు – మన బడి/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమంతో సర్కారు స్కూళ్లకు మహర్దశ పట్టింది. అత్యాధునిక బెంచీలు, గ్రీన్ చాక్బోర్డులు, విద్యుత్ దీపాల వెలుగులు, ఉద్యాన వనాలను తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచే ప్రాంగణాలు, చదువుపై ఆసక్తిని పెంచేలా పెయింటింగ్తో కూడిన ప్రహరీలు, టాయిలెట్స్, డైనింగ్ హాళ్లతో ‘ప్రభుత్వ బడులు భళా’ అనేలా మారుతున్నాయి. కార్పొరేట్కు మించి సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. మొత్తానికి సర్కారు పాఠశాలలు నూతన ఒరవడిని సంతరించుకుంటున్నాయి.
– ఖమ్మం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అంచనాలు రూపొందించడం, పనులు మొదలుపెట్టడం, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం, పనుల్లో వేగం పెంచడం వంటి వాటిల్లో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో 426 స్కూళ్లు మొదటి దశకు ఎంపిక కాగా వీటిల్లో రూ.9 కోట్లు నిధులతో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. ములుగు, సంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
70 స్కూళ్లలో చివరి దశ పనులు..
జిల్లాలో 426 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏడు ప్రభుత్వశాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారుల నేతృత్వంలో పనులు కొనసాగుతున్నాయి. వీటిలో 70స్కూళ్లలో పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్ నెలలోనే వీటిని పూర్తి చేసే ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ పనులపై ప్రతి వారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తున్నారు.
సరికొత్తగా..ఇప్పటివరకు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన అత్యాధునిక ప్రమాణాలతో కూడిన పరికరాలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చరాత బోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన తరగతి గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలతో జిల్లాలో రెండు స్కూళ్లలో వంద శాతం పనులు పూర్తయ్యాయి. కొణిజర్ల మండలం తనికెళ్ల ఎంపీపీఎస్, కొణిజర్ల జడ్పీహెచ్ఎస్లో అన్ని పనులూ పూర్తయి వందశాతం అందుబాటులోకి వచ్చాయి. వైరా మండలంలోని గొల్లెనపాడు ఎంపీయూపీఎస్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి.
కొనసాగుతున్న పనులు..
267 బడుల్లో మేజర్ మరమ్మతులు అవసరమని గుర్తించగా.. 45 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. 189 స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. 33 స్కూళ్ల పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పనులకు 414 స్కూళ్ల గుర్తించగా.. వాటిల్లో 168 స్కూళ్లలో ఆయా పనులు పూర్తయ్యాయి. మరో 213 బడుల్లో ఇదే పనులు జరుగుతున్నాయి. 33 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. తాగునీటి కల్పన పనులు 413 బడుల్లో అవసరమని గుర్తించగా వాటిలో 19 పనులు పూర్తయ్యాయి. 47 స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ అవసరమని గుర్తించగా వాటిల్లో 10 స్కూళ్లలో వాటిని నిర్మించారు. 64 పాఠశాలల్లో డైనింగ్ పనులు అవసరమని గుర్తించి.. వాటిల్లో నాలుగు పాఠశాలల్లో ఆ పనులు పూర్తి చేశారు. 52 పాఠశాలల్లో టాయిలెట్లు అవసరమని గుర్తించగా.. వాటిల్లో ఐదుచోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలినవి తుది దశలో ఉన్నాయి.