ఎడతెరిపిలేని వర్షం
ఉప్పొంగిన వాగులు, వంకలు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
భద్రాచలం గోదావరి వద్ద వరద ప్రవాహం
సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబ్ తుఫాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. జలాశయాలకు జలకళ సంతరించుకోగా.. వాగులు, వంకులు ఉప్పాంగి ప్రవహించాయి. పలు చెరువులు మత్తడి దుంకాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కొన్నిచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. వైరా, పాలేరు రిజర్వాయర్లు, లంకాసాగర్ ప్రాజెక్టు, అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు, పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువు లోకి భారీగా వరద నీరు చేరింది. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు మూడో గేట్ నుంచి దిగువకు వరద నీరు విడుదలవుతున్నది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. ప్రధానంగా పత్తి, మిర్చి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. కొణిజర్ల మండలంలోని అంజనాపురం నిమ్మవాగు, తీగల బంజర పగిడేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై చుట్టపక్కల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా
వేస్తున్నారు.
యంత్రాంగం అప్రమత్తం..
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్శాఖను అప్రమత్తం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బందితో కలిసి సీఐలు, ఎస్సైలు వాగులు పొంగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం, సెప్టెంబర్ 27: భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. సోమవారం ఉదయం 9 గంటలకు 28.4 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 7.30గంటలకు 31.09 అడుగులకు చేరింది. మరో మూడు అడుగుల మేర పెరిగే నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. మరోవైపు రెవెన్యూ, పంచాయతీ అధికారులు లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఇప్పటికే గజ ఈతగాళ్లు, ఎన్టీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కొత్తగూడెం కంట్రోల్ రూం నెంబర్ 08744- 241950కు సంప్రదించవచ్చని తెలిపారు. ఇతర సమాచారాన్ని 93929 19743 వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.