అటవీ ప్రాంత సంరక్షణకు పటిష్ట చర్యలు
కలుపు మొక్కల స్థానంలో గడ్డి మొక్కల పెంపకం
అగ్ని ప్రమాదాల నివారణకు చెక్
వన్య ప్రాణుల ఆహార కొరత నివారణ
లక్ష్మీదేవిపల్లి, జూలై 25: అటవీ ప్రాంత సంరక్షణతో పాటు వన్య ప్రాణ సంరక్షణకు ఆ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో వన్య ప్రాణుల మనుగడను పరిశీలించడానికి సీసీ కెమెరాలు, వేసవిలో దాహం తీర్చడానికి పిట్లు ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా జంతువులకు ఆహారంగా ఉపయోగపడే గడ్డి మొక్కలు (గ్రాస్ ల్యాండ్ మేనేజ్మెంట్) పెంచాలని అటవీశాఖ నిర్ణయం తీసుకున్నది. కొత్తగూడెం డివిజన్లోని అటవీ ప్రాంతంలోని పలుచోట్ల గడ్డి పెంచుతున్నారు. డివిజన్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. ఇవి జం తువులకు ఆహారంగా పనికిరాకపోవడంతో పాటు వేసవిలో అగ్ని ప్రమాదా లు సంభవించే అవకాశం ఉన్నందున వాటి స్థానంలో గడ్డి మొక్కలు పెంచుతున్నారు. జీవవైవిధ్యాన్ని పెంచేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
పలు రకాల మొక్కలు..
కలుపు మొక్కల స్థానంలో అడవి జంతువులకు ఆహారంగా ఉపయోగపడే గడ్డి జాతి మొక్కలు పెంచాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ముందుగా పనికిరాని మహావీర, ఇపోటోరియం జాతి మొక్కలను గుర్తించి తొలగించారు. వీటి స్థానంలో గడ్డి మొక్కలను విస్తారంగా పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. కొత్తగూడెం అటవీ డివిజన్లో ప్రతి మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో కొంతమేర గడ్డి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల, వచ్చే నెలలో సిబ్బంది అడవిలో గడ్డి విత్తనాలు చల్లుతారు. సైనోడాన్, క్లోరిస్, బోథ్రియోక్లోవా, డిజిటేరియా, హెరోగ్రాస్టిస్, క్రైసోపోగాన్, అప్లుడా, ఐసోలిమా వంటి గడ్డి జాతి మొక్కలను అధికారులు ఎంపిక చేశారు. రెండేళ్ల పాటు ఈ మొక్కలు పెరిగితే అడవిలో కలుపు మొక్కల శాతం క్రమక్రమంగా తగ్గనున్నది. గడ్డి మొక్కలు పెంచుతున్న స్థలంలో అటవీశాఖ అధికారులు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గడ్డి పెరిగిన రెండేళ్ల తర్వాత దానిని వన్య ప్రాణుల కోసం వదిలిపెడతామని అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు..
అటవీశాఖ అధికారులు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గడ్డి పెంచుతున్న స్థలాన్నివ వీటి ద్వారా పరిశీలిస్తున్నారు. ఏయే జంతువులు అక్కడికి వస్తున్నాయి? ఏ రకమైన గడ్డిపై అవి ఆసక్తి చూపుతున్నాయి? అన్న అంశాలను వారు పరిశీలిస్తున్నారు. ఇలా అడవి దున్నలు ఎక్కువగా ‘ధెమెడా – హెటిరో పోగాన్’ జాతుల మొక్కలు తింటున్నట్లుగా గుర్తించారు. వాటి కోసం అడవి ఉలవలు, కంది మొక్కలను ఎక్కువగా పెంచుతున్నారు.
అటవీ సంరక్షణకు చర్యలు
అటవీ ప్రాంత సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అడవిలో కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. జంతువులకు ఆహారంగా ఉపయోగపడే జాతుల మొక్కలు పెరగడం లేదు. దీనిని గుర్తించి కలుపు మొక్కల స్థానంలో గడ్డి జాతి మొక్కలు పెంచుతున్నాం. కలుపు మొక్కలతో వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణతో పాటు వన్యప్రాణులకు ఆహారం అందించేందుకు గడ్డి మొక్కలు పెంచుతున్నాం.