కూసుమంచి, ఏప్రిల్ 1 : ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు సోమవారం రాత్రి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 4 వేల క్యూసెక్కుల వరకు పెంచి 3,500 క్యూసెక్కుల నీరు వచ్చే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, ములుగు జిల్లాలోని 2,435 గ్రామాలకు పాలేరు, మాదిరిపురం, సూర్యాపేట ఇన్టేక్ వెల్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు జూన్ చివరి వరకు జాగ్రత్తగా వాడుకునే విధంగా మిషన్ భగీరథ అధికారులు చర్యలు చేపట్టారు. సాగర్ నుంచి సుమారు 3 టీఎంసీల వరకు తీసుకోవాలని నిర్ణయించారు. ఇవి పాలేరుకు చేరే వరకు సుమారు 2 టీఎంసీలైనా వచ్చే విధంగా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పాలేరు నుంచి ఐదు జిల్లాలకు తాగునీరు ఇస్తున్నందున ప్రతి నీటిబొట్టు వృథా కాకుండా జిల్లాస్థాయిలో కలెక్టర్లు.. ఇరిగేషన్, మిషన్ భగీరథ, పోలీస్, రెవెన్యూ, ఐడీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నీటి చోరీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కాలువపై 24/7 గస్తీ ఏర్పాటు చేశారు. పాలేరుకు వచ్చే నీటిని ట్యాంపరింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే ఆదేశాలు జారీ చేశారు. సాగర్లో కూడా నీరు లేని కారణంగా ఈ దఫా ఇచ్చే నీటితోనే ఐదు జిల్లాలకు వేసవి పూర్తయ్యే వరకు తాగునీరు అందించాల్సి ఉంటుం ది.
పాలేరు రిజర్వాయర్గా మారిన తర్వాత 50 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు అట్టడుగు స్థాయి నీటిమట్టం 6 అడుగులకు పడిపోయింది. అయితే సాగర్ నుంచి నీరు వచ్చే వరకు మరో 38 గంటలు పట్టే అవకాశం ఉన్నందున పాలేరు 5.5 అడుగుల అట్టడుగు స్థాయి వరకు పడిపోనున్నది. కాగా.. సాగర్లో వదిలిన నీరు క్రమంగా పాలేరు రిజర్వార్కు రావడానికి సుమారు 38 గంటల సమయం పడుతుంది.