ప్రగతికి చిహ్నం.. ఖమ్మం నగరం
నాడు మురుగు కాల్వలు, గుర్రపు డెక్కలు
నేడు సువిశాలమైన వీధులు, ఆహ్లాద పార్కులు
హైదరాబాద్ తరహాలో అభివృద్ధికి బాటలు
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు ‘నమస్తే తెలంగాణ’
ఖమ్మంలో ప్రాపర్టీ షో ఏర్పాటు అభినందనీయం
రియల్ వ్యాపారులు నాణ్యమైన సేవలు అందించాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, అక్టోబర్ 24: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ప్రగతికి చిహ్నంగా ఖమ్మం నగరం రూపుదిద్దుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని రాజ్పథ్ ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆయనకు నమస్తే తెలంగాణ బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, సర్కులేషన్ ఏసీఎం అజయ్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్బాబు బొకేలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం వివిధ కంపెనీల స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్రో నగరాల్లో ఏర్పాటు చేసే ఇలాంటి షో ఖమ్మంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. చీటింగ్, నకిలీలకు ఆస్కారం లేని వాతావరణం ఉండడంతో నేడు ఖమ్మం నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు.
నాడు మురుగు కాల్వలు.. గుర్రపు డెక్కలు
తెలంగాణ ఏర్పాటుకాక ముందున్న ఖమ్మం నగరానికి, ఇప్పుడున్న ఖమ్మం నగరానికీ ఎంతో తేడా ఉందని మంత్రి గుర్తుచేశారు. నాడు నగరం నడిబొడ్డున గోళ్లపాడు చానెల్ మురుగు కాల్వగా దర్శనమిస్తే నేడు అదే కాల్వను సర్వాంగ సుందరంగా తయారుచేసుకున్నామన్నారు. నగరంలోని అతిపెద్ద చెరువు లకారంలో నాడు గుర్రపు డెక్కలు చూసిన నగరవాసులు నేడు అదే లకారంపైకి నిత్యం ఆహ్లాద వాతావరణం కోసం వస్తున్నారన్నారు. కొద్దిరోజుల్లోనే లకారం ట్యాంక్బండ్పై రూ.100 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి అందుబాటులోకి రాబోతుందన్నారు. సువిశాలమైన రోడ్లు, సర్వాంగ సుందరంగా ప్రధాన వీధులు తయారు చేసుకున్నట్లు చెప్పారు.
‘నమస్తే’ చొరవ అభినందనీయం
జిల్లా కేంద్రంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన ‘నమస్తే తెలంగాణ’ చొరవ అభినందనీయమని మంత్రి అన్నారు. నమస్తే తెలంగాణ అంటేనే తెలంగాణ ప్రజల గుండెచప్పుడని అన్నారు. నాటి ఉద్యమ సమయం నుంచి నేటి అభివృద్ధి వరకు పత్రిక పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. జిల్లాలో పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు, నిర్మాణ సంస్థలతోపాటు, రుణ సదుపాయం కల్పించే బ్యాంకులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతో వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు నమస్తే తెలంగాణ మరింత దగ్గర కావాలని ఆకాంక్షించారు.
మన్ననలు పొందాలి
కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని మంత్రి పువ్వాడ రియల్ఎస్టేట్ వ్యాపారులకు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. నిర్మాణ సంస్థలు, వెంచర్ వేసే వ్యాపారులు తగిన జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవాలని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దోరేపల్లి శ్వేత, రాపర్తి శరత్, గజ్జల లక్ష్మి, కన్నం వైష్ణవి ప్రసన్న, టీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షడు బెల్లం వేణుగోపాల్ పాల్గొన్నారు.
‘ప్రాపర్టీ షో’కు అపూర్వ ఆదరణ
ప్రాపర్టీ షోకు రెండో రోజైన ఆదివారమూ విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వారికి రియల్టర్లు, బ్యాంకర్లు ప్లాట్ల కొనుగోలు, రుణ సదుపాయంపై అవగాహన కల్పించారు. రుణ సదుపాయం గురించి తెలుసుకోవడానికి వందలాది మంది కొనుగోలు దారులు ప్రాపర్టీ షోకు వచ్చారు. వడ్డీ రేట్లు అనుకూలంగా ఉండడంతో కొందరు అక్కడికక్కడే ఒప్పందాలు చేసుకున్నారు.