పేదల వైద్యానికి ఆర్థిక భరోసా..సీఎం సహాయ నిధి
సత్తుపల్లి, జూలై 19: అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా చితికిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలో 54 మందికి రూ.54,81,700 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా.. వాటిని పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
రైతుబంధు మాదిరిగానే దళితబంధు
ఆర్థికంగా వెనుకబడిన దళితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిత పథకాన్ని దళిత బంధు పేరుతో అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్కార్డులు, ఆగస్టు 15 నుంచి పింఛన్లు మంజూరవుతాయని అన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు..
అర్హత లేని చోటామోటా నాయకులకు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని వారు సైతం ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించి, హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సోకిన వారి వద్దకు వెళ్లానని, పౌష్టికాహారం, ఆక్సిజన్, మందులు వంటివి సమకూర్చానని, ధైర్యం చెప్పి వారి ప్రాణాలను కాపాడానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, గాదె సత్యం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, నాయకులు మట్టా ప్రసాద్, కంచర్ల నాగేశ్వరరావు, పెద్దిరాజు, దామోదర్రెడ్డి, పవన్, అనిల్, కొత్తూరు ఉమ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, నాయకులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.