సారపాక, మే 8 : కేసీఆర్ సారథ్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని మహబాబూబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కోరారు. మండలంలోని మోరంపల్లి బంజర్లో సీనియర్ నాయకుడు మేడం లక్ష్మీనారాయణరెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుంచుతానన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కవిత కోరారు.
ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి ప్రశ్నించే ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను మరోమారు గెలిపించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పోడు భూములకు పట్టాలివ్వగా.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే వీటిని అందించామన్నారు. నియోజకవర్గంలో పనిచేసే నాయకుడు రేగా అని, ఆయన ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఎంపీగా కవితను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలవడంతోపాటు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, కేసీఆర్ దెబ్బకు ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్పై కోపంతో ఉన్న రైతులు, ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇచ్చేలా ముందుకు సాగుతున్నారన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ తోటమళ్ల సరిత, గ్రామ శాఖ అధ్యక్షుడు ఖగేందర్రెడ్డి, మండల నాయకులు పొడియం నరేందర్, కొనకంచి శ్రీనివాసరావు, బెజ్జంకి కనకాచారి, గోనెల నాని, చల్లకోటి పూర్ణ, చుక్కపల్లి బాలాజీ, బిట్రా సాయిబాబా, బికారి, వలదాసు సాలయ్య, సాధిక్ పాషా, రవికుమార్, మాజీ సర్పంచ్లు కొర్సా వెంకన్న, కుంజా చిన్నబ్బాయి, బానోతు శ్రీను, భూక్యా సీతారాములు తదితరులు పాల్గొన్నారు.