కనికరం లేని వర్షం అకాలంలో వచ్చింది.. చేతికొచ్చిన పంటను నీళ్లపాలు చేసింది.. రైతులకు కన్నీరు మిగిల్చింది.. నష్టాల ఊబిలోకి నెట్టేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. వారి బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షంతో భద్రాద్రి జిల్లా అతలాకుతలమైంది. లక్ష్మీదేవిపల్లి మండలంలో కొన్ని ఇండ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.. మరికొన్ని ఇండ్లు నేలమట్టమయ్యాయి.. ఆళ్లపల్లి మండలం సింగారం పంచాయతీ పరిధిలోని సంది బంధంలో పిడుగుపాటుకు 15 ఎడ్లు మృత్యువాత పడ్డాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చిలోకి వరద నీరు చేరింది. వాహనాల్లోకి లోడ్ చేస్తున్న పత్తి తడిసి ముద్దయింది. పంట నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/చుంచుపల్లి: అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో జిల్లా అతలాకుతలమైంది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో 10 రేకుల ఇండ్లు, బొజ్జలగూడెంలో రెండు, తిప్పగుట్టలో 20 ఇండ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు లేచి కిందపడ్డాయి. ఆళ్లపల్లి మండలం సింగారం పంచాయతీ పరిధిలోని సంది బంధం గ్రామంలో పిడుగుపాటుకు 15 ఎడ్లు మృత్యువాత పడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. జిల్లావ్యాప్తంగా సగటున 62 మి.మీ వర్షపాతం నమోదైంది. అశ్వాపురం మండలంలో అత్యధికంగా 93 మి.మీ నమోదైంది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా 165ఎకరాల పరిధిలోని ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి, జీడి మామిడి, టమాట తోటలు దెబ్బతిన్నాయి. మొత్తం 61 మంది రైతులు రూ.60 లక్షల మేర నష్టపోయారు. ఎక్కువగా మొక్కజొన్న బొప్పాయి తోటలు నేలవాలాయి. 145 ఎకరాల పరిధిలోని మామిడి తోటల్లో చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. కావడిగుండ్లలో నాటు పొగాకు పందిళ్లు నేలమట్టమయ్యాయి. బూర్గంపాడు, సుజాతనగర్, ఇల్లెందు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. అన్ని పంటలు కలిపి ఒక్క ఇల్లెందు మండలంలోనే 480 ఎకరాల్లో దెబ్బతిన్నది. అలాగే జిల్లావ్యాప్తంగా కల్లాల్లోని వందలాది క్వింటాళ్ల మిర్చి తడిసింది. పలుచోట్ల పత్తిని వాహనాల్లోకి లోడ్ చేస్తుండగా వర్షం కురిసింది. పంట నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.