ఖమ్మం అర్బన్, మార్చి 27: ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే వాల్యుయేషన్ నిర్వహించాల్సి రావడం ఇదే తొలిసారి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పాట్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల వాల్యుయేషన్ చేయాల్సిన ఉపాధ్యాయులే.. సైన్స్, సోషల్ సబ్జెక్టు పరీక్షలకు ఇన్విజిలేషన్ చేయాల్సి ఉంది. పరీక్షలు, మూల్యాంకనం అనే రెండు విధులకు భాషా ఉపాధ్యాయులను ఎలా వినియోగించాలనే అంశంపై అధికారులకు సందిగ్ధం నెలకొంది.
ఖమ్మం సెయింట్ జోసెఫ్ పాఠశాల కేంద్రంగా ఏప్రిల్ 1 నుంచి టెన్త్ స్పాట్ మొదలుకానుంది. దీనికి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ ఉపాధ్యాయులకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ), చీఫ్ ఎగ్జామినర్లు (సీఈ)లుగా విధులు కేటాయించారు. వారికి ఉత్తర్వులు సైతం అందజేశారు. సుమారు 550 మందికిపైగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు.
సీనియారిటీ ఆధారంగా ఏఈలు, సీఈలను ఎంపిక చేశారు. అయితే, ఏప్రిల్ 2న ఫిజకల్ సైన్స్, ఏప్రిల్ 7న బయాలాజికల్ సైన్స్, ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నాన్ లాంగ్వేజెస్ పరీక్షలకు లాంగ్వేజెస్ ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులు కేటాయిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఒకవైపు స్పాట్ వాల్యుయేషన్ చేయాల్సి ఉండగా, మరోవైపు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేషన్ బాధ్యతలనూ నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ (ఈసీఆర్) కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో మాత్రమే కలెక్టర్ అనుదీప్ రూపొందించి నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఇతర విధులు కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలకు సైతం ఎస్జీటీలకు కాకుండా స్కూల్ అసిస్టెంట్లు, పీడీలకు విధులు కేటాయించారు. ఇదే సందర్భంలో స్పాట్ జరుగుతున్న సమయంలోనే టెన్త్ పరీక్షలకు ఎవరిని ఇన్విజిలేషన్ కేటాయించాలనే అంశం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.