ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధించారు. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో హవా చాటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఖమ్మం జిల్లా ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచింది. రాష్ట్రస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 16,826 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 14,928 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతశాతం 88.72 నమోదైంది. 8,739 మంది బాలురకు 7,604 మంది, 8,087 మంది బాలురకు 7,324 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట సగటు 86.60 ఉత్తీర్ణతతో పోలీస్తే జిల్లా ఉత్తీర్ణత 2.12శాతం అధికంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 88 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా వీటిలో 66 స్కూల్స్ ప్రైవేట్ పాఠశాలలు. మిగిలినవి ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, వేల్పేర్ స్కూల్స్. జిల్లాకు చెందిన 220 మంది 10/10 జీపీఏ సాధించారు. వీరిలో 201 మంది ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు. 19 మంది ప్రభుత్వ యజమాన్యాలకు చెందిన విద్యార్థులు.
భద్రాద్రి జిల్లా ఉత్తీర్ణత 78 శాతం..
భద్రాద్రి జిల్లా విద్యార్థులు 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా రాష్ట్రస్థాయిలో 29వ స్థానంలో నిలిచింది. కొత్తగూడెంలోని చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఇ.సాయినిపుణ 10 జీపీఏ, కొత్తగూడెం బీసీ గురుకుల విద్యార్థిని లెక్కల విద్యశ్రీ 10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన గీతాంజలి 9.7, సంహిత 9.3, పుష్ప 9.2, అను 9.2, అశ్రఫ్ పాషా 9.2, హారిక 9.0, అనూష 9.0, హర్షవర్థన్ 9.0 జీపీఏ సాధించారు. జిల్లావ్యాప్తంగా 301 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 36 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. 49 ప్రైవేటు, సర్కార్ పాఠశాలలు 10/10 జీపీఏ సాధించాయి. వీటిలో 46 ప్రైవేటు పాఠశాలలు, రెండు రెసిడెన్షియల్ గురకులాలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నాయి. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 12,481 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,801 మంది ఉత్తీర్ణులయ్యారు. 6,087 మంది బాలురకు 4,630 మంది ఉత్తీర్ణులయ్యారు. 6,394 మంది బాలికలకు 5,171 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 25 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించొచ్చని, వచ్చే నెల 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఫలించిన ఉపాధ్యాయుల కృషి..
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కృషి ఫలించనట్లయింది. ఇరు జిల్లాల కలెక్టర్లు వీవీ గౌతమ్, అనుదీప్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, డీఈవోలు, ఎంఈవోలు స్వయంగా తరగతులను పర్యవేక్షించడం, పక్కాగా ప్రణాళికలు అమలు చేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది. విద్యార్థులకు ఇంటర్నల్ పద్ధతిలో మార్కులు అమలు చేయడం, డీసీఈబీ ఆధ్వర్యంలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు ఉపయోగపడింది.