పెనుబల్లి, జూన్ 6: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ వ్యూహం ఫలిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి వైద్యశాలకు చిరాగ్ ఫౌండేషన్ బాధ్యులు అందించిన మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆదివారం ఆయన పెనుబల్లి వైద్యుడు రమేశ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని, సీఎం కేసీఆర్ కూడా ఇదే చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో ఆంధ్రా ప్రభావం వల్ల కేసులు ఎక్కువగా ఉన్నందున నేరుగా ముఖ్యమంత్రితో చర్చించానని, దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని పంపించి ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నారని అన్నారు. అనంతరం వేంసూరు పశు వైద్యాధికారి కరోనా రోగులకు అందిస్తున్న పండ్లను ఆయన పంపిణీ చేశారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించిన చిరాగ్ ఫౌండేషన్ సభ్యులు బెల్లం మధు, గుర్రం జ్యోతిలను ప్రత్యేకంగా అభినందించారు. వైద్యాధికారి రమేశ్, మండల కొవిడ్ ప్రత్యేకాధికారి ప్రదీప్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, పెనుబల్లి, వీఎం బంజరు సర్పంచ్లు తేజావత్ తావూనాయక్, భూక్యా పంతులి, పాతకారాయిగూడెం సొసైటీ ఛైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.