మామిళ్లగూడెం, ఫిబ్రవరి 4: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఒక రోజూ వృథా కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిలకతో విద్యాబోధన జరగాలని, పూర్తి స్థాయిలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్.. విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, సిలబస్, డ్రాప్ అవుట్స్, వ్యాక్సినేషన్, కుల ధ్రువపత్రాల జారీ తదితర అంశాలపై ఎంఈవోలు, హెచ్ఎంలతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సోమవారం నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండాలని ఆదేశించారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటుగా విద్యార్థులు ప్రత్యక్ష విద్యాబోధన కోల్పోయినందున ఇప్పుడు ప్రత్యక్ష తరగతుల ద్వారా వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 15 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. విద్యార్థులకు అవసరం అయిన కుల ధ్రువపత్రాలను పాఠశాలలోనే అందించే విధంగా తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యాశాఖ సీఎంవో రాజశేఖర్, ఏఎంవో రవికుమార్, ఏడీఎం వెంకటేశ్వరచారి, వివిధ శాఖల అధికారులు జ్యోతి, కృష్ణనాయక్, కే.సత్యనారాయణ, రవికుమార్, ఉదయశ్రీ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.