ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజంతా వాన పడింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భయాందోళన చెందుతున్నారు. చేతికందివచ్చిన పత్తి, మిర్చి, వరి పంటలకు నష్టం వాటిల్లకుండా కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. చేలల్లో ఏరకుండా ఉన్న పత్తి, మిర్చి పంటలు పూర్తిగా తడిసిపోయాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యంపై టార్పాలిన్లు కప్పి దెబ్బతినకుండా చూస్తున్నారు. వాటి చూట్టూ ఎప్పటికప్పుడు నీరు నిలువకుండా చేస్తున్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలు, చేలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించింది. వానముసురుకు ఈదురుగాలులు తోడుకావడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థపడుతున్నారు. ఇప్పటికే రెడ్అలర్ట్ కొనసాగుతుండగా.. మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. బుధవారం సైతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఖమ్మం, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. సోమవారం రాత్రి నుంచి ఒక్కసారిగా వానముసురు ప్రారంభమైంది. తెల్లవారుజామున ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వాన మసురు వీడలేదు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి ఖమ్మం నగరం తడిసిముైద్దెంది. ప్రధానవీధులన్నీ జలమయం కావడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. నాలాలు పొంగడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరింది.
పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయి. నగరంలో పరిస్థితి ఇలా ఉండగా.. పల్లెల్లో మరోవిధంగా కనిపించింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతుండడంతో రైతులు, రైతు కూలీలు ఇంటిని వదలి బయటకు పోలేని పరిస్థితి నెలకొంది. పత్తితీత పనులు జోరుగా సాగుతున్న ఈ తరుణంలో తుపాన్ రావడంతో పత్తి పంట ఎర్రబారడంతోపాటు దూది నాణ్యత కోల్పోయే అవకాశం ఉంది. ఇక మిర్చి తోటలు ఏరివేత దశకు చేరుకున్నాయి. వానకాలం సాగు చేపట్టిన వరి పొలాలు సైతం చేతికొచ్చాయి. ఆయా గ్రామాల్లో కల్లాల్లో మిర్చి, ధాన్యం పంటను రైతులు నిల్వ చేసుకున్నారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా యాతన పడ్డారు. వానముసురుతోపాటు ఈదురుగాలులు సైతం తోడుకావడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. దినసరి కూలీలు సైతం ఉదయం అడ్డాల వద్ద పెద్దగా కనపించలేదు. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకు నిరంతరాయంగా వర్షం కురవడంతో అదేస్థాయిలో వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నాటికి జిల్లావ్యాప్తంగా 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిర మండలంలో 24.2 మి.మీ, ఎర్రుపాలెం 21.4 మి.మీ, బోనకల్ 17.6 మి.మీ, వేంసూరు 13.4 మి.మీ, పెనుబల్లి 16.4 మి.మీ, చింతకాని 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 9 గంటల తరువాత, సాయంత్రం భారీగా వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి మండలం గంగారంలో 41.5 మి.మీ, వేంసూరులో 34.8 మి.మీ, పెనుబల్లి మండలంలో 22.3 మి.మీ, మధిర మండలంలో 21 మి.మీ, బోనకల్లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం కురవడంతో సత్తుపల్లి ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం నగరానికి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. అయితే మంగళవారం నగరం బోసిపోయినట్లు కనిపించింది. దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. రెండురోజుల అనంతరం పంటనష్టం అంచనా వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 5 : మిచౌంగ్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల కోసం ఉపయోగించేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక చొరవతో ఇంప్లాటెడ్ రెస్క్యూ బోటును సిద్ధం చేశారు. విపత్తుల సమయంలో జిల్లాలో సత్వర సహాయక చర్యల కోసం ఒక్కో బోటును రూ.6లక్షల వ్యయంతో కొనుగోలు చేసి 20 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సత్తుపల్లికి ఈ బోటును తరలించారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు బోటును ఉపయోగించనున్నట్లు సిబ్బంది తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మండల వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన వరి ధ్యాన్యాన్ని కల్లాల్లో ఆరబోసుకున్న రైతులు వర్షంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలు కప్పి జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోపక్క సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కిష్టారం ఓసీలో 5వేల టన్నుల బొగ్గు, 25వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలిగింది. జేవీఆర్ ఓసీలో 25వేల టన్నుల బొగ్గు, 1.25లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.