ఖమ్మం, ఆగస్టు 2: రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనతో కేసీఆర్ మహాత్ముడిగా మారారని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై హర్షం ప్రకటిస్తూ ఆయన సోమవారం ఒక ప్రకటన చేశారు. ‘సాగుపై ఆధారపడిన అన్నదాతలకు రూ.50 వేల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం గొప్ప నిర్ణయం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతు రుణ మాఫీ రైతాంగానికి ఆర్థికంగా భరోసా కల్పించినట్లయింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతులను ఆదుకుంటున్నారు. ఉచిత విధ్యుత్, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులతో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కేసీఆర్ దళిత బంధు పథకం పెట్టారు.ఈ నెల 16న ప్రారంభం కాబోతున్న దళిత బంధుతో దళితులు ధనవంతులు కావడం ఖాయం. దళితబంధు పథకానికి చట్టబద్దత కల్పించడం, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లా కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్ ఏర్పాటు చేయడం దళితుల అభివృద్ది పట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుధ్దిని స్పష్టం చేస్తున్నది’ అని ఎంపీ నామా పేర్కొన్నారు.