ఖమ్మం, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరిని మరింతగా కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి చెందుతుంటే ప్రధాని మోదీకి కడుపు మండిపోతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించుకున్న కల్లాలకు కేటాయించిన రూ.150 కోట్లను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపడం ఏంటని మండిపడ్డారు. ఇది నీతిమాలిన విధానమని అభివర్ణించారు. రైతులు నిర్మించుకున్న కల్లాలు నిధులు తిరిగి ఇవ్వాలంటూ కేంద్రం నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రాల్లో మహాధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు.
దీంతో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గల ధర్నాచౌక్లో రైతు మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు భారీగా తరలొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. దేశంలో వివిధ బ్యాంకులను మోసగించి దేశం విడిచి వెళ్లిన వారికి రూ.6 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణ రైతులు కేవలం రూ.150 కోట్లతో పంట కల్లాలు నిర్మించుకుంటే ఎందుకింత కడుపుమంట అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని, దీంతో ఇక్కడ గణనీయంగా పంట ఉత్పత్తులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులను రైతులు ఆరబెట్టుకోవడానికి కల్లాలు అవపసరమని గుర్తించిన సీఎం కేసీఆర్.. ఈజీఎస్ను వ్యవసాయానికి అనుసంధానం చేసి కల్లాలు నిర్మించారని అన్నారు. దీనిని ఓర్వలేని కేంద్రం ఆ కల్లాలకు వెచ్చించిన నిధులను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారని విమర్శించారు. చేపలు ఆరబెట్టుకునేందుకు గుజరాత్ సహా పలు రాష్ర్టాలు కల్లాలు నిర్మించుకుంటే తప్పుపట్టని మోదీ.. తెలంగాణ రైతుల కల్లాలపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు.
నిధులు ఇవ్వకుండా వివక్ష
ప్రధాని మోదీకి ధైర్యముంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా ఇప్పటికే మోదీ తన వివక్షను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కుటుంబంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రధాని మోదీని వారు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. గత రెండు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ప్రకటించిన హామీలను కాకుండా ఇవ్వని హామీలను అమలు చేస్తూ అనేక పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తెలంగాణపై కేంద ప్రభుత్వం వివక్షను వీడకపోతే ప్రజలు వీరుల్లాగా పోరాడుతారని పేర్కొన్నారు.
పువ్వాడ అజయ్ ఆదేశాలతో..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ ఆదేశాలతో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలొచ్చి ధర్నాలో పాల్గొన్నారు.
కేసీఆర్ వంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరు..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా రైతులకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. రైతులు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ వంటి రైతు బాంధవుడు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ లేరు. రూ.లక్షల కోట్లు బ్యాంక్ రుణాలను ఎగవేసిన కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీకి రైతులపై కాస్తంత ప్రేమైనా లేకపోవడం దారుణం. రైతులు ఏర్పాటు చేసుకున్న కల్లాలకు విడుదలైన రూ.150 కోట్లను కేంద్రం తిరిగి ఇవ్వాలని కోరడం సిగ్గుమాలిన చర్య. దేశంలో బీజేపీ చేస్తున్న దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీకి బుద్ధి చెప్పాలి. బీజేపీ రైతులకు మేలు చేసే పార్టీ అయితే ఏడాదిలో ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేలా కృషి చేయాలి. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ధాన్యం కొనే ప్రభుత్వం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నది.
– లింగాల కమల్రాజు, జిల్లా పరిషత్ చైర్మన్, ఖమ్మం
బీజేపీకి ప్రజలు సమాధి కట్టే రోజులు వచ్చేశాయి..
ప్రజలు బీజేపీకి సమాధి కట్టే సమయం వచ్చేసింది. సీఎం కేసీఆర్కు రైతుల కష్ట సుఖాలు తెలుసు. వ్యవసాయం గురించి ప్రదాని మోదీకి ఏమీ తెలియదు. ప్రధాని మోదీకి నిద్రలేవగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకువస్తున్నారు. ప్రధానికి దడుపు జ్వరం పట్టుకున్నది. తెలంగాణ ప్రజలు ఎవరికీ భయపడరు. పోరాట పటిమ ఉన్న ప్రజలు ఇక్కడివారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి వనరులు లేక, పంటలు పండక రైతులు ఇబ్బంది పడేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఏటా రెండు పంటలు పండిస్తున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రధాని మోదీ తన కుటిల బుద్ధి చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలను అడ్డదారిలో కొనుగోలు చేయాలని యత్నిస్తున్నారు.
– లావుడ్యా రాములునాయక్, వైరా ఎమ్మెల్యేరైతాంగాన్ని పట్టించుకోని ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టింది. రైతులకు కేంద్రం చేసిన మేలు ఇసుమంతైన లేదు. దొడ్డిదారిన మూడు నల్ల చట్టాలను అమలు చేసేందుకు ప్రధాని మోదీ యత్నించారు. రైతుల పోరాట పటిమకు తలొగ్గి సదరు చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు ఉద్యమం ప్రధాని మోదీకి చెంపపెట్టు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయనపై ప్రధాని మోదీ విషం చిమ్మడం దారుణం.
– నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్, ఖమ్మం
కేంద్రం విధానాలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం..
భారత రాజ్యాంగం సూచిస్తున్న ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకునే విధానాలను అవలంబించాలి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలను కూలదోసే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నది. ఉపాధి హామీ నిధులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని దేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో మున్ముందు మరిన్ని పోరాటాలు జరుగుతాయి.
– రాయల శేషగిరిరావు, డీసీఎంఎస్ చైర్మన్
సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ అక్కసు..
దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భాగంగానే రైతులు నిర్మించుకున్న కల్లాల నిధులను వెనక్కు ఇవ్వాలని నోటీస్లు ఇవ్వడం దారుణం. బీఆర్ఎస్ స్థాపన తర్వాత బీజేపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదు.
– బొర్రా రాజశేఖర్, మార్కెఫెడ్ వైస్ చైర్మన్
ప్రధాని మోదీని గద్దె దించాలి..
ప్రధాని మోదీని గద్దె దించితేనే దేశావ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరుగుతుంది. కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. గతంలోనూ తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనమని చెప్పింది. రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసింది. సీఎం కేసీఆర్కు ప్రజల మద్దతు ఉన్నది. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నది.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్
కేసీఆర్ రైతుల పక్షపాతి..
సీఎం కేసీఆర్ అమలు చేసిన విధానాలతోనే రాష్ట్రవ్యాప్తంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. ఇది ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులకు కంటగింపు అయింది. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా, సాగునీటి వసతి కల్పన, పంట పెట్టుబడి అందజేత, రైతుబీమా, ధాన్యం కొనుగోలు.. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను అమలు చేయాలని చూస్తే రైతులు ఉద్యమించి చట్టాలు అమలు కాకుండా చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మరోసారి తిరగబడే సమయం ఆసన్నమైంది.
– బచ్చు విజయ్కుమార్, సుడా చైర్మన్, ఖమ్మం
అన్నం పెట్టే రైతుకు అన్యాయం..
దేశానికి అన్నం పెట్టే రైతుకు ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో దిగుబడులు పెరిగాయి. కేంద్రం కల్లాలు వేసుకోవడం వద్దని చెప్తున్నది. కల్లాలు లేకుండా రైతులు పంటను ఎక్కడ ఆరబోసుకోవాలి ? రోడ్లపైన పంట పోసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదా? ఉపాధి నిధులతో కల్లాలు ఏర్పాటు చేసుకుంటే తప్పేముంది? కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష చూపడం దారుణం.
– కూరాకుల నాగభూషణం, డీసీసీబీ చైర్మన్