తెలంగాణలో సాగుకు స్వర్ణయుగం వచ్చింది. ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది. దీంతో వ్యవసాయ సీజన్లలో జిల్లాకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ర్టాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. ఏడాదిలో సుమారు ఆరు నుంచి ఏడు నెలల వరకు ఇక్కడే ఉండి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట నియోజకవర్గానికి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్, 24-సౌత్ పర్కానస్ ప్రాంతాల నుంచి వందలాది కుటుంబాలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నాయి.
నాడు : ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలన్నీ కుదేలయ్యాయి. గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేస్తేగానీ పూటగడవని కుటుంబాలు ఉపాధి కోసం ఇతర నగరాలు, రాష్ర్టాలకు వలస వెళ్లేవి. నాటి కష్టాలు గుర్తుకొస్తే గుండెలవిసిపోతాయి.
నేడు : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో వలసవెళ్లిన కుటుంబాలు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాయి. అంతేకాదు, ఇతర రాష్ర్టాల కూలీలకు సైతం తెలంగాణలో ఉపాధి దొరుకుతున్నది. ప్రస్తుతం వలస కూలీలకు తెలంగాణ అడ్డాగా మారింది.
అశ్వారావుపేట టౌన్, జనవరి 6: స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో దేశంలోని ఇతర రాష్ర్టాలకంటే ముందంజలో ఉన్నది. సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ దేశానికే అన్నపూర్ణగా మారింది. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం, సాగునీటి ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు నిర్మించడం, మిషన్ భగీరథ పథకంలో భాగంగా చెరువులు పునరుద్ధరించడం, ఏటా రెండు సీజన్లకు పెట్టుబడి సాయం అందించడంతో రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏటికేడు సాగు విస్తీర్ణమూ పెరుగుతున్నది. కూలీల అవసరం నానాటికీ పెరుగుతున్నది. దీంతో పొరుగు రాష్ర్టాల నుంచీ కూలీలు వస్తున్నారు.
సాధారణంగా రెండు వ్యవసాయ సీజన్లలో జిల్లాకు పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వలస కూలీలు వస్తారు. ఏడాదిలో సుమారు ఆరు నుంచి ఏడు నెలల వరకు ఇక్కడే ఉండి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. సంపాదించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తారు. ప్రస్తుతం అశ్వారావుపేట నియోజకవర్గానికి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్, 24-సౌత్ పర్కానస్ ప్రాంతాల నుంచి వందలాది కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చాయి. స్థానిక రైతులు వారిని ఆదరించి వసతులు కల్పించడంతో ఏటా ఇక్కడికే వస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్, 24-సౌత్ పర్కానస్ ప్రాంతంలో వర్షాధారంగానే పంటలు పండుతాయని వలస కూలీలు వెల్లడిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి, చెరువులు ఎండిపోయి ఉంటాయంటున్నారు. వ్యవసాయ సీజన్లలో రెండు మూడు నెలలకు మించి ఉపాధి దొరకదంటున్నారు. ఒకవేళ దొరికినా రోజుకు రూ.350 కూలి దొరకడం కష్టమంటున్నారు. తెలంగాణలో వ్యవసాయ పనులు పుష్కలమని, ఒక్కో కుటుంబానికి రోజుకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 కూలి లభిస్తుందంటున్నారు. ఒక ఎకరా వరి నాటుకు గుత్తాగా రైతులు రూ.4 వేలు ఇస్తారంటున్నారు. ఈ కారణంతోనే ఐదేళ్ల నుంచి అశ్వారావుపేట ప్రాంతానికి వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని దమ్మపేట, పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లోనూ బెంగాలీ కూలీలు ఉపాధి పొందుతున్నారంటున్నారు.
అశ్వారావుపేట ప్రాంతానికి ఏటా వందలాది మంది కూలీలు వలస వస్తారు. ముందుగా మధ్యవర్తులు ఇక్కడికి వస్తారు. రైతులతో మాట్లాడి వేతనాలు, సదుపాయాల గురించి మాట్లాడతారు. జూలై నుంచి జనవరి వరకు ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. సాధారణంగా ఒక్కో మండలానికి రెండు నుంచి మూడు బ్యాచ్లు రోజువారీ పనులకు కుదరుకుంటాయి. ఒక్కో బ్యాచ్కు 15 మంది బృందంగా పని చేస్తారు. రోజుకు 6 నుంచి 8 ఎకరాలు వరకు వరినాట్లు వేస్తుంటారు. ఇలా ఒక్కో కూలీ నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తాడు. వలస కూలీల రాకతో స్థానిక రైతులకూ కూలీల కొరత బెడద తప్పింది.
వ్యవసారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. వ్యవసాయానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఏటా సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్నారు. సాగునీటి వనరులు పుష్కలగా ఉన్నాయి. మా ప్రాంతానికి వచ్చిన వలస కూలీలకు రైతులు అండగా నిలుస్తున్నారు. వారికి ఉపాధినివ్వడమే కాక పిల్లాజల్లా ఉండడానికి వసతులు కల్పిస్తున్నారు.
– ఆకుల రామకృష్ణ, రైతు, అశ్వారావుపేట
మాకు పశ్చిమ బెంగాల్లో ఉపాధి దొరకడం లేదు. ఈ కారణంతోనే ఏటా ఇక్కడికి వస్తున్నాం. ఆరు నెలలు పనిచేసి సంపాదించుకుని తిరిగి స్వస్థలానికి వెళ్తున్నాం. ఇక్కడి రైతులు మాకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నారు. కొందరు కూలీలు కుటుంబమంతా కలిసి వస్తే, కొన్ని కుటుంబాల నుంచి మగవారు మాత్రమే వస్తారు. అందరికీ కూలి గిడుతున్నది.
– కనరం మండల్, వలస కూలీల మేస్త్రి, పశ్చిమ బెంగాల్
తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. ఇతర రాష్ర్టాల కూలీలకు ఇక్కడ ఉపాధి దొరకుతున్నది. మా రాష్ట్రంలో పంటలకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు లేవు. అక్కడి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదిలో ఒకపంటకు సాగునీరు అందడం గగనంగా ఉంది.
– నజీన్, మిరిడీజ్, వెస్ట్ బెంగాల్
మేం పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చాం. మేం ఉంటున్న ప్రాంతంలో రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. ఏడాదిలో రెండు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఉపాధి దొరకదు. మేము ఐదేళ్ల నుంచి కుటుంబాలతో కలిసి తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడి రైతులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తిండి, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. నెలకు ఒక్కో కూలీ రూ.40 వేల వరకు సంపాదించుకుంటున్నాడు.
-టపాస్ సర్దార్, వలస కూలీ, పశ్చిమ బెంగాల్