లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 23: బంగారం కోసమే పథకం ప్రకారం కేతపల్లి సుధాకర్ను హత్య చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న ఎదురుగడ్డ సమీపంలో జరిగిన హత్య కేసు మిస్టరీని వెల్లడించారు. చాతకొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన పాషా 2013 నుంచి 2017 వరకు కేతపల్లి సుధాకర్కు సంబంధించిన వెంకటేశ్వర స్టీల్ సిండికేట్లో మిషన్ ఆపరేటర్గా పనిచేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పాషా డ్రైవింగ్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధం వల్ల భద్రాచలంలోని ఓ లాడ్జిలో 15 రోజులు ఉండి డబ్బులు అయిపోయాయి. తరువాత సదరు మహిళను ఎలా చూసుకోవాలో అర్థంకాక ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పాషా తిరిగి కొత్తగూడెం వచ్చాడు. తనకు పరిచయం ఉన్న సుధాకర్ వద్ద డబ్బులు తీసుకుందామని ఈ నెల 6న కొత్తగూడెం వచ్చి రాత్రి 8 గంటల సమయంలో ఆయనకు ఫోన్ చేసి పిలిచాడు. వచ్చిన తరువాత అతడి మెడలో ఉన్న బంగారం చైన్, చేతికి ఉన్న ఉంగరాన్ని గమనించాడు. రెండు రోజుల తరువాత మళ్లీ సుధాకర్ను కలిశాడు. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనుకున్నాడు.
తన వద్ద బైక్ లేదని, ఎదురుగడ్డలోని తన స్నేహితుడిని వద్ద దింపి రావాలని సుధాకర్ను కోరాడు. దీంతో ఇద్దరూ కలిసి బయలుదేరారు. మధ్యలో చిప్పముత్తులింగం కాలనీ సమీపంలో ఖాళీ ప్రదేశంలో ఆపి తనకు డబ్బులు కావాలని, లేకుంటే మెడలో ఉన్న బంగారం ఇవ్వాలని అడిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సుధాకర్ చెప్పగా అక్కడే ఉన్న ఇనుప గొట్టంతో అతడి తలపై బలంగా కొట్లాడు. దీంతో సుధాకర్ కిందపడిపోయాడు. భయబ్రాంతులకు గురైన పాషా.. మరో రెండు సార్లు సుధాకర్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మెడలో ఉన్న బంగారు చైన్, ఉంగరం తీసుకొని పాషా అదే బైక్పై ఎదురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జి ఏరియాకు వచ్చాడు. మెయిన్ రోడ్డు పక్కన పొదల్లో బైకును దాచాడు. ఇనుప గొట్టాన్ని కొద్దిదూరంలో పొదల్లో పడేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఓ టెంట్హౌస్ యజమాని వద్ద ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందామని వచ్చే సరికి పోలీసులు అరెస్టు చేశారు.