అశ్వారావుపేట టౌన్, సెప్టెంబర్ 28 : పామాయిల్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్ సారథ్యంలో మంగళవారం నిర్వహించిన పామాయిల్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణకు ఎటువంటి అనుమతులు లేకుండా పామాయిల్ గెలలను తరలిస్తుండడంతో ఇక్కడి రైతులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారని అన్నారు. అందుకని ముందస్తు మేల్కొలుపుతో గెలల అక్రమ రవాణాకు చెక్పెట్టి రైతులను కాపాడడమే ధ్యేయమని పనిచేస్తామని అన్నారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి మండలాల పరిధిలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చే పామాయిల్ గెలల ట్రాక్టర్లను నివారించవచ్చన్నారు. అదేవిదంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా పామాయిల్ గెలలను రైతుల తరలించవద్దని సూచించారు. ఒకవేళ తరలిస్తే అటువంటి రైతులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రా నుంచి గెలలతో వచ్చే ట్రాక్టర్లను సీజ్ చేయాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. కొత్తగూడెం డీటీవో జయపాల్రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా తెలంగాణలోకి వచ్చే పామాయిల్ గెలల ట్రాక్టర్లను సీజ్ చేస్తామని అన్నారు. ఆ ట్రాక్టర్లను కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయం నుంచి రిలీజ్ చేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అక్రమంగా ఇక్కడికు వచ్చే ట్రాక్టర్లను నిలువరించే సమయంలో రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీఐ ఉపేంద్రరావు, పామాయిల్ రైతు సంఘం నాయకులు ఆలపాటి రాంప్రసాద్, కోటగిరి సీతారామస్వామి, శీమకుర్తి వెంకటేశ్వరావు, నండ్రు రమేశ్, జూపల్లి రమణారావు, తలసిల ప్రసాద్, అంకత ఉమామహేశ్వరావు, కాసాని వెంకటేశ్వరావు, కొల్లు వెంకటరమణ, అశ్వారావుపేట, దమ్మపేట ఫ్యాక్టరీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.