ఖమ్మం కల్చరల్, జూలై 29 :కొవిడ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో సినీ వినోదానికి తెర లేచింది.. సెకండ్ వేవ్ కొవిడ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభానికి ఈ నెల 30 నుంచి అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు, సినీ అభిమానులు, ప్రేక్షకుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కొవిడ్ నేపథ్యలో గతేడాది కాలంగా థియేటర్లకు గడ్డు పరిస్థితులొచ్చాయి. గతేడాది మార్చి నుంచి కొవిడ్ ప్రభావంతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్తో థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరి నుంచి తిరిగి ప్రారంభమైనా.. కరోనా కారణంగా పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యం ఇవ్వలేదు. సెకండ్ వేవ్ మళ్లీ విజృంభించడంతో ఏప్రిల్ 16 నుంచి తిరిగి థియేటర్లు మూసేశారు. ప్రస్తుతం కొవిడ్ నుంచి ఉపశమనం కలగడంతో నాలుగు నెలల అనంతరం నేటి నుంచి థియేటర్లు ప్రారంభం కానున్నాయి. వందశాతం సీటింగ్ సామర్థ్యంతోపాటు పార్కింగ్కు అనుమతి ఇవ్వడంతో థియేటర్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
13 నుంచి అన్నీ..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏడు థియేటర్లు ఉన్నాయి. ప్రభుత్వం థియేటర్ల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి రెండు, వచ్చేనెల 6 నుంచి మరో రెండు, 13 నుంచి అన్ని థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.
థియేటర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఆహాలు వచ్చినా.. థియేటర్లో కూర్చొని 70 ఎంఎం వెండి తెర, డిజిటల్ సౌండ్ వేవ్స్తో సినీ సన్నివేశాలను తిలకిస్తే ఆ అనుభూతి వేరే. థియేటర్లు ప్రారంభం అవుతున్నాయంటే ప్రేక్షకుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నాలుగునెలల క్రితం థియేటర్లు తెరవడంతో కరోనాను సైతం లెక్క చేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఫస్ట్, సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యంత్రాలు స్తంభించకుండా రోజూ కనీసం అరగంట సేపు వాటిని ఆపరేట్ చేసేవారు. దీంతో కరెంట్ బిల్లు, సిబ్బంది, పారిశుధ్యం తదితర ఖర్చులు భారంగా మారాయి. దీంతో సిబ్బంది, క్యాంటీన్, పంపిణీ దారులు, యజమానులు ఆర్థికంగా నష్టపోయారు. శుక్రవారం నుంచి తిరిగి థియేటర్లు ప్రారంభం కానుండడంతో ఊరట చెందుతున్నారు.
పార్కింగ్కు అనుమతి
వందశాతం సామర్థ్యంతో థియేటర్ల ప్రారంభంతోపాటు పార్కింగ్కు అనుమతి ఇవ్వడం ఆనందాన్నిస్తోంది. థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభానికి ముందస్తుగానే అనుమతి ఇచ్చినా.. ఆంధ్రాతో ముడిపడి ఉండడంతో ఇక్కడ ప్రారంభం ఆలస్యమైంది. ఏడాది కాలంగా ఎంతో నష్టపోయాం. థియేటర్లకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాం. -కాంపాటి పిచ్చయ్య, ఆదిత్య థియేటర్ యజమాని