ఖమ్మం వ్యవసాయం, జూలై 29 : నర్సరీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించనివారు కటకటాల పాలు కావాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఒక్కోసారి రెండు రకాల శిక్షలు అమలు చేసే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా మెజార్టీ నర్సరీల నిర్వాహకులు జీవా అనే రకం మిర్చినారు మళ్లు పోయడం, తద్వారా విత్తనాలు నకిలీ అని తెలియడంతో పెద్దఎత్తున రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్రస్థాయిలో ఈ విషయంపై పెద్ద దుమారం రేపింది. అందుకు కారణమైన 101 మంది మిర్చి విత్తనాల డీలర్ల లైసెన్స్లు రద్దు అయ్యాయి. మరికొందరిపై పీడీ యాక్టు అమలు చేశారు. టమాట, ఇతర కూరగాయలకు సంబంధించిన నారుమళ్లలో మొక్కలు నాణ్యత లేకపోవంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను పరిగణంలోని తీసుకున్న జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఈ ఏడాది ఆరంభం నుంచి ముందస్తు చర్యలు చేపట్టింది.
మిర్చి తోటలు వేసే సమయం రావడంతో జిల్లా అధికారి రంగంలోకి దిగారు. పక్షం రోజుల నుంచి ఆయా మండలాల్లోని నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించుకోని నర్సరీలు, రిజిస్ట్రేషన్ చేయించుకోని రెన్యువల్ చేయించుకోని వారి వివరాలను ఆయా డివిజన్ల ఉద్యానశాఖ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరికొద్ది రోజుల్లో సీజన్ ఊపందుకోనుండడంతో నర్సరీ నిర్వాహకులకు నర్సరీల చట్టం 2017పై క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు. సదస్సులకు హాజరైన నిర్వాహకులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. నర్సరీల నిర్వహణకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలనే ఉద్దేశంతో ఆయా నియోజకవర్గాల, గ్రామాల విస్తరణ అధికారులకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. ఎవరైనా నర్సరీల చట్టం ఉల్లంఘిస్తే 2017 నర్సరీ చట్టం ప్రకారం నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు ఇలా
నర్సరీలు ఏర్పాటు చేసుకోబోయే నిర్వాహకులు 2017 నర్సరీ చట్టం ప్రకారం రిజిష్ర్టేషన్ చేయించుకోవాలి. ఇందు కోసం పండ్ల మొక్కల ఉత్పత్తికిగాను రూ.5 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కూరగాయలు, పుష్పాలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల తయారికి వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. 2-4 లక్షల మొక్కల ఉత్పత్తికి రూ.1,000, 4 లక్షల పైబడి మొక్కల తయారికి రూ.2,500 చొప్పున ఫీజు చెల్లించాలి. నిబంధనలు పాటించని నర్సరీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. రూ.50 వేల జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించనున్నారు. ఒక్కోసారి జరిమానాతోపాటు, జైలుశిక్ష సైతం విధించే అవకాశం ఉంది.
నాసిరకం నారు అంటగడితే చర్యలు
మిర్చి నర్సరీలను తనిఖీలు చేస్తున్నాం. కొనుగోలు చేసిన విత్తనాలు, అవరమైన రశీదులు పరిశీలిస్తున్నాం. ఏ ఒక్క రైతు మోసపోకుండా నాణ్యమైన నారు, తక్కువ ధరలకు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. -జీ అనసూయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి-ఖమ్మం