Agriculture | అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 25 : రైతన్నలు ఏనాడో మరిచిన దేశీవరి వంగడాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలోని దిబ్బగూడెం గిరిజన రైతులు. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో దేశవాళీ విత్తనాలతో వరి పండిస్తూ అధిక దిగుబడులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. నాబార్డు వారి సహకారంతో వాసన్ సంస్థ పర్యవేక్షణలో జీవకమిటీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో గిరిజన గ్రామాల్లో ర్యాలీలు సైతం నిర్వహించి రైతులకు దేశీయ వరి సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
ఈక్రమంలో గిరిజన రైతుల ఆలోచనా సరళి మారింది. దిబ్బగూడెంలో సుమారు 70 కుటుంబాలు ఉండగా 18 కుటుంబాల వారు దేశీవరి సాగు చేసేందుకు ముందుకొచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చనే నమ్మకంతో పలువురు రైతులు గో ఆధారిత వ్యవసాయంపై ఆసక్తి కనబర్చారు. నాబార్డు వారి సహకారంతో ఈ సంవత్సరం కుళ్లాకార్, మాలీపూర్, కూచీపాటలీ, నవార, ఇంద్రాణి తదితర వరి వంగడాలను పండించి అద్భుతాలు సాధించారు. ఈ బియ్యం తింటే షుగర్, బీపీ, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
నా వయస్సు 65 ఏళ్లు. భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. 4 ఎకరాల భూమి ఉంది. దానిలో 3 ఎకరాలు కౌలుకు ఇచ్చాను. ఎకరంలో నేను తినడానికి యాసంగి సీజన్లో జీవకమిటీ, వాసన్ సంస్థ సహకారంతో మాలీపూర్ వరి వంగడం సాగు చేశాను. ఆవుపేడ, ఆవు మూత్రంతో తయారుచేసిన జీవామృతం ప్రతి 15రోజులకు పిచికారీ చేస్తున్నా. ఘన జీవామృతం కూడా వరిలో చల్లాను, కలుపురాకుండా అజోల్లా కూడా వేశారు. నాటువేసి 60 రోజులు దాటింది. ఈ బియ్యం ఆహారంగా తీసుకుంటే గర్భిణులకు సులభంగా కాన్పు జరుగుతుంది. పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బలమైన పోషకాలు ఉంటాయని చెప్పారు.
అందుకే సాగుచేశాను. ఇప్పటివరకు కషాయాలకు, నాటు వేయడానికి రూ.2 వేలలోపు మాత్రమే ఖర్చు అయింది. ఖరీఫ్లో పూజా విత్తనం వేశాను. 16 బస్తాలు దిగుబడి వచ్చింది. బస్తా రూ.2500లకు అమ్మాను. ఖర్చు రూ.5 వేలు లోపు మాత్రమే అయింది. గతంలో ఎప్పడు యాసంగిలో వరి సాగు చేయలేదు. పెట్టుబడి తక్కువని కుళ్లాకార్, మాలీపూర్ రబీలో కొద్దికొద్దిగా సాగు చేశాను. పంట చాలా బాగుంది. నా పంటను చూసేందుకు చాలామంది వస్తున్నారు. అందరికీ ప్రకృతి వ్యవసాయం చేయమని చెబుతున్నాను. నా భూమిలో పండిన వరి విత్తనాలు కావాలని అడుగుతున్నారు. ఇస్తానని చెప్పాను.
– మొడియం సింగమ్మ, దిబ్బగూడెం
ఈ వానకాలం సీజన్లో ఎకరంలో ‘నవార’ దేశవాళీ వరిరకం వేసి 25 బస్తాలు పండించాను. విత్తనాలు నాబార్డు సహకారంతో వాసన్ సంస్థ వారు పరిగి నుంచి తెప్పించారు. వరి మడుల్లో జీలుగు విత్తనాలు చల్లి 40రోజుల తర్వాత కలియదున్ని దమ్ము చేసి నాటువేశాను. నారుపోసిన 15 నుంచి 18రోజుల మధ్య నాటువేశాను. తొలిసారి భూమిలో రసాయనిక ఎరువులకు బదులు గోవుమూత్రం, పేడ, గోధుమపిండి, బెల్లం, గుప్పెడు పుట్టమట్టితో తయారుచేసిన బీజామృతం బీఆర్సీ కేంద్రం నుంచి తీసుకొచ్చి పిచికారీ చేశాను. అమావాస్య, పున్నమి(15రోజులకోసారి) పిచికారీ చేశాను. 125 రోజుల నుంచి 130రోజుల తర్వాత కోతకు వచ్చింది. ఈ బియ్యం తినడం వల్ల షుగర్, బీపీ కంట్రోల్ అవుతుంది. నరాల బలహీనత కీళ్ల నొప్పులకు మంచింది. కిలో బియ్యం రూ.200 అమ్ముతున్నాను. రెండుపూటల తినకుండా ఒకపూట ఆహారంగా తీసుకోవచ్చు. మేము వారంలో 2, 3 రోజులు తీసుకుంటాము. యాసంగిలో నవార, మాలీపూర్, కుళ్లాకార్ ఎకరన్నరలో కొద్దికొద్దిగా సాగు చేశాను. ఇప్పటివరకు నాటువేసి 60రోజులు దాటింది. ఖర్చు రూ.3 వేలు దాటింది.
– మొడియం రాములమ్మ, దిబ్బగూడెం
నేను కుళ్లాకార్ దేశవాళీ వరి సాగు చేశాను. గతంలో ఎప్పడు ఈ పంట గురించి నాకు తెలియదు. జీవకమిటీ ద్వారా తెలుసుకున్నాను. ఎలా ఉంటదోనని అర ఎకరం సాగు చేశాను. 90 రోజుల పంట. ఇప్పటికి రూ.2 వేల లోపు ఖర్చు అయింది. జీవామృతం, ఘన జీవామృతం పిచికారీ చేశాను. రసాయనాలు ఏమీ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చనే నమ్మకం కలిగింది. ఎరువులు వాడిన పంట కంటే ఈ పంట చాలా బాగుంది. భూమిలో కూడా తేడా గమనించాను. ఆరోగ్యం బాగుంటుంది. మొదట్లో భయపడ్డాను. పొటాషియం, కార్బొహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయని చెప్పారు. మరో నెలరోజుల్లో పంట చేతికొస్తుంది.
– జమ్మి జయరాజు, దిబ్బగూడెం