శాసనసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం పది నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసి ఓటర్ల జాబితాను రూపొందించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల ఓటర్ల జాబితాను బుధవారం విడుదల చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించిన అధికారులు కొత్త ఓటర్లను నమోదు చేయించారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.
ఖమ్మం, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనసభ ఎన్నికల నిర్వహణకు వేగం పెంచిన భారత ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం విడుదల చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆరు నెలలుగా జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా ఓటర్ల నమోదుతోపాటు చేర్పులు, మార్పుల కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులు జిల్లాలో ఎలాంటి తప్పులు లేని తుది ఓటర్ల జాబితాను రూపొందించారు. ఐదు నియోజకవర్గాల్లోని 1,439 పోలింగ్ స్టేషన్లలో సవరించిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేశారు.
అన్ని నియోజకవర్గాల్లోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతోపాటు బూత్ లెవల్ అధికారులకు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. తుది ఓటర్ల జాబితాను అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రచురించారు. జిల్లావ్యాప్తంగా పురుష ఓటర్లు 5,80,411, మహిళా ఓటర్లు 6,15,807 మంది ఉన్నారు. వీరితోపాటు ట్రాన్స్జెండర్లు 75 మంది తమ ఓటును నమోదు చేసుకున్నారు. ఎన్ఆర్ఐలు 146, సర్వీస్ ఓటర్లుగా 682 మంది ఉన్నారు. దివ్యాంగులు 26,968, వయోవృద్ధులు 16,761, 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు 44,204 మంది ఓటర్లుగా ఉన్నారు. జిల్లాలో మొత్తంగా 11,96,293 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు ప్రకటించారు. జిల్లాలో అతి తక్కువ 1,90,755 మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా వైరా ఉండగా.. అత్యధికంగా 3,15,726 మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఖమ్మం ఉంది. మిగతా మూడు నియోజకవర్గాలోనూ రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వాటిలో పాలేరు 2,32,606, మధిర 2,18,585, సత్తుపల్లి 2,38,621 మంది ఓటర్లు ఉన్నారు.