అశ్వారావుపేట, జనవరి 13 : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఇకపై ఆన్లైన్ అటెండెన్స్ పడనున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మాన్యువల్ హాజరుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎంఎస్) యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ కొత్త ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఉపాధి పనుల్లో పారదర్శకత, అధికారుల పర్యవేక్షణను సులభతరం చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై శిక్షణ తీసుకున్న ఈజీఎస్ క్షేత్ర సిబ్బంది ఆన్లైన్లోనే కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 15,807 జాబ్కార్డులు ఉండగా 32,603 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరిలో 7,711 జాబ్ కార్డుదారుల్లో 12,856 మంది కూలీలు రోజు వారీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
కూలీల వలసలను నివారిస్తూ స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత పారదర్శకతకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై ఉపాధి పనులతోపాటు కూలీల హాజరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు తాజాగా కేంద్రం ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ను అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామాల్లో జరిగే ఉపాధిహామీ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ యాప్ ద్వారా కూలీలకు ఆన్లైన్లో హాజరు నమోదు చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎన్ఎంఎంఎస్ పద్ధతి వల్ల ఉపాధి హామీ పథకంలో పారదర్శకతతోపాటు అధికారుల పర్యవేక్షణ సులభతరంకానున్నది. యాప్ నిర్వహణపై ఇప్పటికే ఈజీఎస్ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తైంది. ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో ఎన్ఎంఎంఎస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే ఆన్లైన్లో మస్టర్ నమోదవుతున్నది. పనులు జరిగే ప్రదేశం నుంచే జియోట్యాగ్ చేసి కూలీలకు ఆన్లైన్లో హాజరు వేస్తున్నారు. దీంతో లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్లో పనులు వివరాలు, కూలీల హాజరు నమోదు కానున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు, పశువుల పాకల నిర్మాణం, ఇంకుడుగుంతలు వంటి వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తింపజేస్తున్నారు.
రోజుకు రెండుసార్లు హాజరు
కొత్తగా అమల్లోకి వచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్ వల్ల ఉపాధి కూలీలకు ఒక రోజులో రెండుసార్లు హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం ఒకసారి ఆన్లైన్లో కూలీల హాజరు నమోదు చేసిన తర్వాత సాయంత్రం 4గంటలకు మరోసారి హాజరు వేయాల్సి ఉంది. ఇలా కూలీల హాజరు మరింత పకడ్బందీకానున్నది. దీనివల్ల కూలీల హాజరులో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరించడమూ కుదరదు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల వివరాలు స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర రాజధానులు ఢిల్లీ, హైదరాబాద్ కార్యాలయాల్లో ఉండే అధికారులు కూలీల హాజరు, ఉపాధి తీరును యాప్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా 15,807 జాబ్కార్డులు ఉన్నాయి. వీటిలో 32,603 మంది కూలీలు నమోదై ఉన్నారు. 7,711 జాబ్కార్డుల్లోని 12,856 మంది కూలీలు రోజువారీ ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
కూలీలకు తప్పని తిప్పలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల నిర్వహణలో తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్తో కూలీలకు తిప్పలు తప్పేటట్లు లేదు. ఇప్పటివరకు ఉదయం మాత్రమే ఉపాధి పనులు చేసుకున్న కూలీలు కొత్త సాఫ్ట్వేర్ వల్ల ఉదయం, సాయంత్రం కూడా పనులకు హాజరుకావాలని నిబంధన పెట్టింది. ఉదయం 11గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2గంటల తర్వాత మరో ఫొటో తీసి సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలి. ఒక గ్రామ పంచాయతీలో చేపట్టిన పని పూర్తి అయిన తర్వాతనే మరో పని చేపట్టాలన్న షరతు ఉంది. దీనివల్ల గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. అంతేకాకుండా రోజూ చేపట్టే పనులను వెంటనే యాప్లో పొందపరచాలనే నిబంధన క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేక యాప్లో అప్లోడ్ చేయడం ఇబ్బందికరంగా మారి పనుల్లో జాప్యం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కూలీ కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో పథకాన్ని అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో కూలీలు ఉపాధిహామీ పనులకు దూరమయ్యేటట్లు కనిపిస్తున్నాయి.
అమల్లోకి ఎన్ఎంఎంఎస్ ప్రక్రియ
ఉపాధి కూలీల హాజరు కచ్చితంగా ఉండేందుకు ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ యాప్ను అమల్లోకి తెచ్చింది. పనులు జరుగుతున్న ప్రదేశం నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లు లైవ్ లొకేషన్లో రెండుసార్లు అటెండెన్స్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల కూలీల హాజరు, పనుల తీరు, పనుల్లో పారదర్శకత, అధికారుల పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. సిగ్నల్ సమస్య ఉత్పన్నమైతే ఏపీవోలకు ఫీల్డ్ అసిస్టెంట్లు సమాచారం ఇస్తే కూలీల హాజరు నమోదు చేస్తారు. జిల్లావ్యాప్తంగా 15,807 జాబ్కార్డులు ఉన్నాయి. వీటిలో 32,603 మంది కూలీలు నమోదై ఉన్నారు. 7,711 జాబ్కార్డుల్లోని 12,856 మంది కూలీలు రోజువారీ ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
– విద్యాధర్రావు, ఎంపీడీవో, అశ్వారావుపేట