ఖమ్మం, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం శివారులోని 100 ఎకరాల సువిశాల స్థలంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు అంచనాలను మించి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్న నేపథ్యంలో సభలో భాగస్వాములు అయ్యేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఖమ్మంలోనే మకాం వేసి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నియోజకవర్గాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల ప్రభావం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నది. తాను తెలంగాణ ఉద్యమంలో పని చేసినప్పుడు ఏనాడూ కార్లలో వెళ్లలేదని, జనంలో ఒకడిగా జనం మధ్య లారీల్లో వెళ్లేవాడినని ఉత్సాహ పరుస్తూ చేసిన ప్రసంగాలు కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతున్నది. సమావేశాల్లో ప్రజలతో సభకు వచ్చే వారు చేతులు ఎత్తాలని మంత్రి హరీశ్రావు ఉత్సాహపరిచారు. సభల్లో లారీలు, డీసీఎం వాహనాల్లో ప్రజలతో వస్తామని ఎక్కువమంది కార్యకర్తలు, నేతలు చేతులు ఎత్తేవారు. ఒకరిద్దరు కార్లలో వస్తామని చెతులెత్తేవారు. నాయకులు సభకు వచ్చే ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవాలని, వారికి ఏ లోటు రాకూడదని సూచించారు. సభ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకు ఓపికగా వేచి ఉండేలా చూడాలన్నారు. శాసనసభ్యులు, నియోజకవర్గాలకు నియమితులైన ఇన్చార్జులు వాహనాల ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించడంతో వారు స్వయంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సత్తుపల్లి నియోజకవర్గానికి నాయకులు ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు, నూజివీడు బస్ డిపోల నుంచి అదనపు బస్సులు కేటాయిస్తున్నారు.ఇవే కాక లారీలు, వ్యాన్ల యజమానులతో మాట్లాడుతున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముందు అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ సీజన్, అయ్యప్ప మాలధారుల యాత్రల నేపథ్యంలో వాహనాల కేటాయింపునకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించి పార్టీ శ్రేణులు వాహనాలు కేటాయింపునకు కృషి చేస్తున్నారు. సభకు అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో నాయకులు నియోజకవర్గాల్లో అదనపు వాహనాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రఘునాథపాలెం, జనవరి 14 : సభాస్థలం నాయకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. డోజర్లు, పొక్లెయిన్స్ ఇప్పటికే ఆ ప్రదేశాన్నంతా చదును చేయించారు. పిచ్చి మొక్కలను తొలగించారు. సభావేదిక వద్ద వీవీఐపీ, వీఐపీ, ముఖ్యనేతలు, జర్నలిస్టులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా షామియానా సమకూరుస్తున్నారు. కంట్రాక్టర్లు శరవేగంగా షామియానా పనులు పూర్తి చేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి వసతి కల్పిస్తున్నారు. సభకు వచ్చే ప్రధాన మార్గంలో ఇప్పటికే ‘దేశ్ కీ నేత’ అనే పేరుతో పార్టీ అధినేత కేసీఆర్, ‘వీ లవ్ కేటీఆర్’ పేరుతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భారీ కటౌట్లు వెలిశాయి. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభ ఆవరణ గులాబీమయమవుతున్నది.
సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీస్శాఖ చర్యలు తీసుకుంటున్నది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి వేలాదిగా వాహనాలు తరలివచ్చే అవకాశం ఉంది. వాహనాలు పార్కింగ్ చేసిన తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రజలు సభ వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.