మానకొండూర్ రూరల్, డిసెంబర్ 19: బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడాచైర్మన్ జీవీ రామకృష్ణారావుతో పాటు నాయకుల మీద చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మానకొండూర్ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమాశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శంకరపట్నం మండలాధ్యక్షుడు ఘంట మహిపాల్ మాట్లాడుతూ బీఎస్పీ జెండాను కూల్చడంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు, నాయకులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ జెండా గద్దెను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో గ్రామ పంచాయతీ వారు కూల్చితే నాయకులకు సంబంధాలు అంటగట్టడం సరికాదని హితవు పలికారు. జెండా గద్దె నిర్మాణానికి సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ జెండాను కట్టుకోవడానికి ఎవరూ అడ్డుపడరని, జెండా అనేది ప్రజల గుండెల్లో ఉండాలని సూచించారు.
2001లో తెలంగాణ ఉద్యమం మెదలైనప్పటి నుంచి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారని, నిత్యం లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ, వారి ఇబ్బందులను తెలుసుకొని వెంట వెంటనే పరిష్కారం చేస్తున్న విషయం కనిపించడం లేదా అని నిలదీశారు. అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ర్టాలతో అభివృద్ది జరుగుతుందని, ఆనాడు తెలంగాణ ఉద్యమ కారులు కొట్లాడుతుంటే వారిపై సమైక్య వాదులతో కలిసి కేసులు పెట్టిన చరిత్ర నీది కాదా, ఆనాటి విషయాలు మరిచిపోయావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ ని స్థాపించిన కాన్సీరాం అడుగుజాడాల్లో నడువకుండా బహుజనులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రవీణ్కుమార్, వైఎస్టీపీ అధ్యక్షురాలు షర్మిల బీజేపీ షాడోలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బెజ్జంకి మండలాధ్యక్షుడు మాట్లాడుతూ మానకొండూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని ముసుగేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించింది మీ యాత్రలో కనబడలేదా అని నిలదీశారు. బహుజనులను తప్పుదోవ పట్టిస్తున్న మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. జక్కని సంజయ్ నీ చరిత్ర శంకరపట్నం వాసులందరికీ తెలుసని, అది మర్చిపోయి మాట్లాడుతున్న నీకు మా నాయకులు తిరగబడితే మీ పార్టీ మనుగడే ఉండదని స్పష్టం చేశారు.
మ్మెల్యేను, బీఆర్ఎస్ నాయకులను, క్యాడర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతకుంట సర్పంచ్ ఆడెపు రజిత, ఆముదాలపల్లి సర్పంచ్ బత్తుల మానస, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఎంపీటీసీలు ఉండింటి సులోచన-శ్యాంసన్, పిట్టల కవిత-మధు, నాయకులు ఈల శంకర్బాబు, పులికోట రమేశ్, కే రాజయ్య, ఎండీ ఆఫ్జల్, కిషన్ రెడ్డి, కే కుమార్, మల్లేశం, ఇస్కుల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.