సోషల్ మీడియాలో చూసి చోరీలు
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దొంగ
వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్
జగిత్యాల కలెక్టరేట్, జూలై 4 : 22 ఏండ్లకే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం దొరికినకాడల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో చూసి చైన్స్నాచింగ్లు చేస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోమవారం అతడి అరెస్ట్ను జగిత్యాల పోలీస్ స్టేషన్లో చూపి, డీఎస్పీ ప్రకాశ్ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్కు చెందిన ఆముద ప్రవీణ్ కొంతకాలం నుంచి జులాయిగా తిరుగుతున్నాడు. దొరికినకాడల్లా అప్పులు చేసి జల్సాలు చేసేవాడు. అయితే అప్పులు ఇచ్చిన వారు తిరిగివ్వాలని ఒత్తిడి తేవడంతో చోరీలు చేసి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. సోషల్మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను చూశాడు.
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ బంగారు గొలుసులను లాక్కెళ్తే దొరికే అవకాశముండదని భావించి చోరీలను ఎంచుకున్నాడు. ఈ నెల1న పట్టణంలోని గోవింద్పల్లిలోని ఓ కిరాణా దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళను గమనించాడు. బైక్ను షాపు ఎదుట నిలిపి సిగరేట్ ఇవ్వాలని అడిగాడు. ఆమె సిగరేట్ను అతడి చేతికి ఇస్తుండగా మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలు డయల్ 100కు కాల్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల టవర్సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ప్రవీణ్ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతడు పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని విచారించడంతో దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 17 గ్రాముల బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన జగిత్యాల పట్టణ పోలీసులు, బ్లూకోల్ట్స్ సిబ్బందిని డీఎస్పీ ప్రకాశ్ అభినందించారు.