గోదారమ్మ తరలివచ్చింది. యాసంగిలో పంటలను తడిపేందుకు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పరుగులు తీసి, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు జలాశయానికి నీరు చేరింది. దాదాపు అరగంట పాటు జలాలు తరలిరాగా, నందిమేడారం పంపుహౌస్ వద్ద గేట్ వాల్వు లీకవ్వడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. మళ్లీ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటుండగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గంగాధర, ఫిబ్రవరి 28: మెట్ట ప్రాంతమైన గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్లు తొక్కింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మండలానికి తరలివచ్చి యాసంగి పంటలకు భరోసా కల్పించింది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ కట్టకు గండిపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులకు రూ.90 లక్షలు మంజూరు చేయించారు. పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి మరమ్మతులు పూర్తిచేయించారు.
అయితే జలాశయంతో నీరు లేకపోవడంతో యాసంగి పంటలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి పంప్హౌస్ నుంచి నీటిని విడుదల చేయించారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్లంపల్లి జలాలు నారాయణపూర్ రిజర్వాయర్కు చేరుకున్నాయి. అయి తే అరగంట తర్వాత నందిమేడారం పంపుహౌస్ వద్ద గేట్ వాల్వు లీకవడంతో ఆటంకం ఏర్పడింది. వెంటనే అధికారులు నీటి విడుదలను నిలిపివేయించారు. కాగా, సమస్యను పరిష్కరించి తిరిగి నీటి విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.