కమాన్పూర్, ఏప్రిల్ 17: యాసంగిలో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. ఎక్కడికక్కడ సాగునీరు లేక భూములు నెర్రెలు వారుతున్నాయి. పంటలు చేతికొచ్చే తరుణంలో ఎండిపోతున్నాయి. కమాన్పూర్ మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది. పదేండ్ల కాలంలో రెండు పంటలు సాగు చేసి మంచి దిగుబడులు తీసిన రైతులు, ఇప్పుడు చుక్కనీటి కోసం తండ్లాడాల్సి వస్తున్నది. పోయినేడు యాసంగితో పోలిస్తే ఈ సారి 500 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గించి.. 6,862 ఎకరాల్లో వరి వేసినా ఫలితం లేకుండా పోతున్నది.
ఎస్సారెస్పీ కాలువల నీరు చివరి ఆయకట్టు రాక, చెరువులు, కుంటలు అడుగంటి, భూగర్భజలాలు పాతాళానికి చేరగా.. పంటలకు నీరందని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. కాపాడుకునే దారి లేక కన్నీరు పెడుతున్నారు. సర్కారు వైఫల్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు ఎల్లని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నేను పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. అప్పు చేసి మరీ 2లక్షల దాకా పెట్టుబడి పెట్టిన. మొదట్లో నీళ్లు మంచిగానే ఉండె. పంట బాగానే ఎదిగింది. ఇక చేతికచ్చే టైం నీళ్లు లేక ఎండిపోతున్నది. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. పెట్టిన పెట్టుబడిల సగం కూడా అచ్చెటట్టు లేదు. కౌలు ఎలా కట్టాలో తెలుస్తలేదు. అన్నింటికి మునుగుడే అయితంది. సర్కారే ఆదుకోవాలి.
– ముక్కెర మల్లేశ్, రైతు (జూలపల్లి)