కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 7: కరీంనగర్ మండలంలోని దుర్శేడ్లో పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తున్న విషయం గ్రామ ప్రత్యేకాధికారి తనిఖీలో వెలుగు చూసింది. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామాన్ని ప్రత్యేకాధికారి రామకృష్ణ సందర్శించారు. గ్రామ సభ అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు.
శానిటేషన్ పనులపై చర్చించారు. తర్వాత స్టోర్ రూమ్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం బియ్యం పరిశీలించగా, 18 బస్తాలు పురుగులు పట్టి నాణ్యత లేకుండా కనిపించాయి. ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దీంతో ప్రత్యేకాధికారి వెంటనే ఎంఈవో మధుసూదనాచారికి ఫోన్ చేసి మాట్లాడారు. బియ్యాన్ని మార్చి పంపాలని కోరారు.