Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడికే-1 గనిలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు తమను తీవ్రంగా వేధిస్తుందని, ఆమెను వెంటనే గని నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ధర్నాకు దిగారు. గనిలో జనరల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జనగామ స్వప్న అనే కార్మికురాలు తన అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అండదండలు ఉన్నాయని, ప్రతీ సందర్భంలో పేర్కొంటూ గనిలో కార్మికులు అధికారులను ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని కార్మికులు వందలాదిమంది ధర్నాలో కూర్చొని ఆమెను బదిలీ చేసే వరకు తాము ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ మానాల శ్రీనివాస్ గని హెడ్ ఓవర్ మెన్ వినయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాలుగా జీడీకే-1 గనిలో పని చేస్తున్న జనగామ స్వప్న అనే కార్మికురాలు ప్రతీ సందర్భంలో కార్మికులను తనకి ఇష్టం వచ్చినట్టుగా దూషించడం కారణం లేకుండానే వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, తన అధికార పార్టీలో ఉన్నానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తనకు దగ్గరని తాను ఏదైనా చేస్తానని, ఆమె బెదిరిస్తుందని వాపోయారు.
మహిళా కార్మికురాలైనందున తాము ఓపిక పట్టిన ఆమె చేస్తున్న పనులు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఈ గనిలో ఉంటే ఎవరు పని చేయలేరని ఆమెను వెంటనే బదిలీ చేయాలని, లేకుంటే తాము విధులకు వెళ్లబోమని, గనిని మూసుకోవాలని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జనరల్ మేనేజర్ ఇక్కడికి వచ్చి ఆమెను బదిలీ చేస్తామని హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
గని అధికారులు కార్మికులను సముదాయించడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. చివరకు అధికారులు జనరల్ మేనేజర్ కు సమాచారం అందించారు. ఒక మహిళ కారణంగా కార్మికులు విధులు బహిష్కరించి మూకుమ్మడిగా ధర్నా నిర్వహించడం సంచలనం కలిగించింది. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు రామగుండం ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో? వేచి చూడాల్సిందే..!