పంట పొలాల సాక్షిగా శ్రమజీవులు చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై కైగట్టి పాటలు పాడుతున్నారు. ఇటీవల ఉచిత కరెంట్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను పాటల రూపంలో ఎండగడుతున్నారు. గంగాధర మండలం లింగంపల్లిలో నాట్ల్లు వేసుకుంటూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై పాడుతున్న పాటలు కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఈరవేణి మల్లవ్వ పాడిన పాట ఆలోచింపజేస్తున్నది.
– చొప్పదండి/ గంగాధర/ రామడుగు జూలై 20
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై గంగాధర మండలం లింగంపల్లిలో మహిళా రైతులు, కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్పై మండిపడుతూ పాటలు కైగడుతున్నారు. మహిళా కూలీలు వరి నాట్లు వేస్తూనే ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో ప్రశంసిస్తున్నారు. ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, మహిళా సంఘాలకు రుణాలు, కులవృత్తులకు లక్ష సాయం, దళిత బంధు.. ఇలా అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న సహాయాన్ని పాటలుగా అల్లుకుని శ్రమ గీతాలు ఆలపిస్తున్నరు. ‘కేసీఆర్నైన ఉయ్యాలో.. ఎప్పటికి మరువం ఉయ్యాలో.. కాంగ్రెసునైతే ఉయ్యాలో.. తరిమి కొట్టుతాము ఉయ్యాలో” అంటూ పాడుతున్నారు.
ఈరవేణి మల్లవ్వ కైగట్టి పాడిన ఈ బతుకమ్మ పాటకు తోటి కూలీలు గొంతుకలిపిన తీరు అందరినీ ఆలోచింప జేయగా, గురువారం ఆ కూలీలు ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. మూడు గంటలు కరెంట్ సరిపోతుందని మాట్లాడిన రేవంత్పై మండిపడుతున్నారు. ఆయనది ఏవుసం చేసిన ముఖమేనా..? మూడు గంటలు ఎట్లా సరిపోతుంది? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, అందుకే నాడు రాక్షసుల పాలన చూపిన ఆ పార్టీని తరిమి కొడతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని చెప్పారు. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ అంటూ నినదించారు.
కేసీఆర్ లేకుంటే ఎవుసం ఆగమైతది
కేసీఆర్ లేకుంటె ఎవుసం ఆగమైతది. రైతులకు 24 గంటల కరెంటు ఇత్తెనే మంచిగుంటది, 3 గంటల ఏడ సరిపోద్ది. మాటలు మాట్లాడుటానికి కాంగ్రెసోళ్లకు సోయి ఉండాలె. పదేండ్ల కింద కరెంట్ ఉండేది కాదు.. ఇప్పుడు 24 గంటలు ఉంటంది. నీళ్లకు ఢోకాలేదు. 24 గంటల కరంట్ ఉంటె ట్రాన్స్ఫారాలు కాలిపోవు, మోటర్లు మంచిగ నడుస్తయి. నాకు ఎకురం 24 గుంటల భూమి ఉంది..రైతుబంధు కింద 7 వేల దాక అత్తన్నయి, మళ్ల కేసీఆర్ అత్తెనె మంచిగుంటది.
– ఈరవేణి మల్లయ్య, లింగంపల్లి(గంగాధర)
తెల్వకుంట మట్లాడద్దు
ఎవుసం గురించి తెల్వకుంట ఏదిపడితే అది మాట్లాడద్దు. రోజుకు 3 గంటల కరెంటు ఇస్తే ఎకురం పొలం కూడా పారది. మరి మొత్తం పొలం ఎట్ల పారుతదో ఆ మాట్లాడినోళ్లకే తెలవాలె. పదేండ్ల కింద నీళ్లు లేక, కరెంటు లేక అరిగోస పడ్డం. పొలం ఏసినా నీళ్లు పారక ఎండిపోయినయి. తెలంగాణ సర్కారు అచ్చినంక నీళ్లు మస్తు ఉంటున్నయి. పొద్దంత కరెంటు ఉంటంది. మళ్లా కేసీఆర్ సారే వత్తడు.
– ఈరవేణి పోచమల్లవ్వ, లింగంపల్లి(గంగాధర)
నీళ్లు ఫుల్లు.. కరెంటు ఫుల్లు
తెలంగాణ వచ్చినంక నీళ్లు ఫుల్లు ఉంటున్నయి. కరెంటు ఫుల్లు ఉంటున్నది. రైతుల గురించి కే’ఈఆర్ సారు ఒక్కడే ఆలోచన చేసిండు. 60 ఏండ్లల్ల ఎవ్వలు చేయనంత రైతులకు మంచి చేసిండు. రైతబంధు, 24 కరంటు ఇత్తుండు, రైతుల చనిపోతే వాళ్ల కుటుంబానికి 5 లక్షలు ఇత్తుండు. పింఛన్లు ఇత్తుండు. ఇంకా మాకు ఎంగావాలె. మళ్ల కేసీఆర్నే గెలిపిచ్చుకుంటం.
– ఈరవేణి మల్లవ్వ, లింగంపల్లి(గంగాధర)
కాళేశ్వరంతో సాగు బంగారమైంది
తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచే ఎవుసం బంగారమైది. చెరువుల్లో 356 రోజులు నీళ్లు ఉంటున్నయి, 24 గంటల కరెంటు ఇత్తున్నరు.. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు మూడు గంటల కరెంటు ఇచ్చుడుతోని రైతులం ఇబ్బంది పడ్డం. రాత్రిపూడ కరెంటు పెట్టుటానికి పొయేటోళ్లం. ఇప్పుడు పగటిపూటనే పొలానికి నీళ్లు పారించుకుంటున్నం.
– ఈరవేణి మునిరాజు, లింగంపల్లి(గంగాధర)
3 గంటలన్నోళ్లు మాకు అవసరం లేదు
ఎవుసానికి 24 గంటల కరెంటు ఇచ్చే కేసిఆర్ సారే మాకు కావాలె. 3 గంటల కరెంటు ఇచ్చెటోళ్లు మాకు అవసరం లేదు. ఎవుసానికి 3 గంటల కరెంట్ ఎట్ల సరిపోతదో కాంగ్రెసోళ్లు చెప్పాలె. అన్ని గాలి మాటలు మాట్లాడుడు కాదు. ఇక్కడ పొలంలకు వచ్చి చూస్తే రైతుల కష్టం తెలుస్తది. ఎన్నటికైనా రైతుల గురించి ఆలోచించేది కేసీఆర్ సారే.
– జుర్రు ఎల్లవ్వ, లింగంపల్లి(గంగాధర)