వేములవాడ, డిసెంబర్ 25: వలపు వల విసురుతూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ కిలేడీ ఆర్థికంగా ఉన్న పలువురు వ్యక్తుల నుంచి రూ.కోటి దాకా లూటీ చేసింది. హోంగార్డుగా పనిచేస్తూ, ఆమె వ్యవహరించిన తీరు ఆ పోలీస్ శాఖకే కళంకం తెచ్చిపెట్టింది. ఈ ఘటన వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళా హోంగార్డు కొంతకాలం వేములవాడలో పనిచేసిన సమయంలో రాజన్న ఆలయంలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన శేఖర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నది. ముందుగా తన భర్త ఆరోగ్యం బాగాలేదని చెప్పి, అతని నుంచి దాదాపు 5లక్షలు తీసుకున్నది. డబ్బులు తిరిగి అడిగిన క్రమంలో శేఖర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయగా, దీనిపై వేములవాడ ఠాణాలో ఈనెల 5న కేసు నమోదైంది. అలాగే వేములవాడ రూరల్ మండలం అనుపురం గ్రామానికి చెందిన పర్శరామ్తో పరిచయం పెంచుకొని ఏకంగా 45 లక్షలు కాజేసింది. మోసపోయానని తెలుసుకున్న పర్శరాం అక్టోబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంకా హైదరాబాద్కు చెందిన ఇద్దరు న్యాయవాదులతో కలిసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ 15 లక్షలు డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలోనూ వేములవాడ పట్టణ ఠాణా, హైదరాబాద్లో ఈ నెల 3న కేసు నమోదైంది. మరో ఘటనలో వేములవాడలోని సుభాష్నగర్కు చెందిన వేముల సుజాతను మోసం చేసింది. పట్టణంలో దుకాణం నిర్వహిస్తున్న సుజాతతో కిలేడీ మహిళ కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్నది.
ఖరీదైన కార్లలో ఆమె దగ్గరికి వస్తూ, అప్పుడప్పుడూ షాపులో ఉద్దెర పెడుతూ అప్పు తీసుకునే స్థాయికి పరిచయాన్ని పెంచుకున్నది. దాదాపు 9లక్షలు తీసుకున్నది. డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ ముఖం చాటేయడంతో బాధితురాలు ఈ నెల 11న వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో వేములవాడకు చెందిన వ్యక్తితో పరిచయం ఉండగా అతను దుబాయి వెళ్లిన తర్వాత 20లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై బాధితుడు ఇటీవలే వేములవాడకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో హోంగార్డుగా పనిచేసిన ఆ మహిళ, మూడు జిల్లాలోనూ అలాగే వ్యవహరించినట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలలో ఆమెపై ఎనిమిది కేసులు నమోదైనట్టు పోలీస్ శాఖ ద్వారా తెలిసింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లోనే నాలుగు కేసులు ఉండగా, జగిత్యాలలో రెండు, కరీంనగర్ పట్టణంలోనూ మరో రెండు ఫిర్యాదులు పోలీసులకు అందినట్లు సమాచారం. అవసరమైతే వల, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చిన కిలేడీ దోపిడీ వ్యవహారం ఇటీవలే బయటికి రాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తుండడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నది.