కమాన్చౌరస్తా, అక్టోబర్ 14 : ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నగరంలో శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడగా, పాటలతో ఆలయాలు, వీధులన్నీ మార్మోగాయి. నగరంలో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చి ఆడారు.
భగత్నగర్లోని మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రథమ పౌరురాలు యాదగిరి అపర్ణ-సునీల్ రావు డివిజన్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. రాంనగర్లోని సత్యనారాయణస్వామి ఆలయం వద్ద డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ ఆధ్వర్యంలో, నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో, జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో కార్పొరేటర్ గందె మాధవి ఆధ్వర్యంలో, రాంచంద్రాపూర్ కాలనీలో కార్పొరేటర్ జయశ్రీ ఆధ్వర్యంలో, 8వ డివిజన్లో కార్పొరేటర్ సల్ల శారదారవీందర్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు.
అల్ఫోర్స్లో విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ వనజ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అలరించాయి. ఈ వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ సతీమణి రజిత, కుటుంబ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ గోపి సతీమణి పుష్పశ్రీ, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరై బతుకమ్మ ఆడారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ ఆడారు.
నగరంలోని శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలు బ్రాంచీల్లో విద్యార్థునులు ప్రత్యేకంగా బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. వేడుకలకు విద్యాసంస్థల చైర్మన్ రమేశ్ రెడ్డి హాజరై విద్యార్థులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో డైరెక్టర్ నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ఎల్ శ్రీనివాస్, ఏజీఎం వరుకోలు శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
నగరంలోని ఎస్వీజేసీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా సాగాయి. వేడుకలకు కళాశాల డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి, వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరై ప్రారంభించారు. విద్యార్థునులు పెద్ద సంఖ్యలో సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఆడిపాడారు.
కలెక్టరేట్, అక్టోబర్ 14: నగరంలోని క్రిస్టియన్ కాలనీలో గల బాలసదనంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాల్లో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి పాల్గొని, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడిపే ఇతర పిల్లల మాదిరిగానే బాలసదనంలోని పిల్లలు సంబురంతో పండుగ జరుపుకునేందుకే, వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలసదనం సూపరింటెండెంట్ సంతోషి, కౌన్సెలర్ కీర్తి, శిశుగృహ మేనేజర్ తేజస్వి, సామాజిక కార్యకర్త రాజేశ్, ఏఎన్ఎం రమ, చిన్నారులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 14: కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు.
తెలంగాణ చౌక్, అక్టోబర్ 14: నగరంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొని కోలాట ప్రదర్శనలు, దాండియా ఆడారు. వేడుకల్లో డిపో మేనేజర్ మల్లేశం, సూపర్వైజర్లు నాగమణి, కమల, వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.