కరీంనగర్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఊరూరా.. వాడవాడలా ప్రచారం మొదలు పెట్టాయి. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారు ఇంటింటికీ వెళ్లి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం ధర్మపురిలోని నృసింహ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సమన్వయ సమావేశం నిర్వహించారు.
చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కొడిమ్యాల మండలం నల్లగొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, నల్లగొండ, తిప్పయ్యపల్లిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి ప్రచారం చేశారు. వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంతో మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పార్టీ సీనియర్ నేత ఏనుగు మనోహర్రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. మేడిపల్లిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి దిశానిర్దేశం చేశారు.
రాయికల్ మండలంలో జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ ప్రచారం చేశారు. పెద్దపల్లి మండలంలో అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఇంటింటా ప్రచారం చేపట్టారు. గోదావరిఖనిలో రామగుండం అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రజాశీర్వాద యాత్ర చేపట్టారు. ఇల్లంతకుంటలో మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రజాశీర్వాద సభ నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్తూ ఈ నెల 17న జరిగే సీఎం సభకు తరలిరావాలని బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ను గెలిపించి, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.