నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రతి వంద ఓటర్లకు ఒక బృందాన్ని నియమించి, సదరు బృందం ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించేలా కార్యోన్ముఖులను చేస్తున్నది. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించడమే కాదు, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా శిక్షణ ఇస్తున్నది. అందుకోసం నియోజకవర్గాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు శుక్రవారం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ధర్మపురి నియోజకవర్గంలో అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమాలను ప్రారంభించి దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పార్టీకి 7.12 లక్షల మంది సభ్యులుండగా, శ్రేణులతో కలిసి నేటి నుంచి ముమ్మర ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. సభ్యత్వాల నమోదులో ఏ పార్టీ కూడా దరిదాపుల్లో లేకపోగా, కదనరంగంలోకి గులాబీ సేన దిగుతుండడం చూసి ప్రతిపక్షాల గుండెల్లో దడ పుడుతున్నది.
కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. క్షేత్రస్థాయిలో ఉన్న సైన్యాన్ని పూర్తిగా రంగంలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామగ్రామాన పార్టీ సభ్యత్వాలు ఉండగా, అందులో ఔత్సాహికులను గుర్తించి, వారిని ప్రచారానికి సమాయత్తం చేసింది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ గులాబీ సైనికులు కదనరంగంలోకి దిగుతుండగా, ప్రతిపక్షాల గుండెల్లో దడ పుడుతున్నది. ఎందుకంటే.. ఇతర పార్టీలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేని పరిస్థితి ఉన్నది. ఆయా పార్టీలకు పెద్దగా సభ్యత్వం లేదు. ఉన్నా.. వాళ్లను ఏనాడూ ఆదుకున్న పాపాన పోలేదు.
ఈ నేపథ్యంలోనే అతి పెద్ద సభ్యత్వమున్న గులాబీ పార్టీ దూసుకెళ్తున్నది. గడపగడపకూ వెళ్తూ.. మద్దతు కూడగడుతున్నది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించే నాటికే బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో మొదటి దఫా ప్రచారం పూర్తి చేశారు. దీంతోపాటు హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, కోరుట్ల పెద్దపల్లి, మంథని నియోజవర్గాల్లో అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించగా, ఆయాచోట్ల ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అంతేకాదు, ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలతో సరికొత్త జోష్ నిండింది. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలతోపాటు ఓటు హక్కు గురించి వివరించడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. అలాగే, మ్యానిఫెస్టో గురించి చెప్పినప్పుడు.. తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. మళ్లీ బీఆర్ఎస్సే రావాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది.
ఈ నేపథ్యంలోనే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, అలాగే 20న మానకొండూర్, 24న రామగుండం, 26న జగిత్యాల, వేములవాడలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి జోష్ నింపారు.
ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్, ప్రచారానికి వెళ్లే నాయకులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. చేసిన అభివృద్ధిని చెప్పడమే కాదు, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా తీర్చిదిద్దేందుకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రారంభించారు. కథలాపూర్, మేడిపల్లి, భీమారంలో నిర్వహించిన ఈ శిబిరాలకు ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలో అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మార్గదర్శనం చేశారు. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన విజయాలు, గడిచిన తొమ్మిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గడపగడపకూ వెళ్లి వివరించేలా శిక్షణ అందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, అందులో నిజానిజాలను ప్రజలకు వివరించేలా తర్ఫీదునిస్తున్నారు.
గడిచిన యాభై ఎనిమిదేండ్ల సమైక్య పాలనలో పడిన కష్టాలు.. స్వరాష్ట్రంలో తర్వాత సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాల గురించి గులాబీ సేనకు శిబిరాల్లో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. నాడు కరెంట్ కష్టాలు, కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయిన పంటలు, అడుగంటిన భూగర్భజలాలు, నీళ్లు లేక నెర్రెలు బారిన భూములు, రైతుల అగచాట్లు, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు, అర్ధరాత్రి కరెంట్తో మరణాలు, రోడ్డున పడ్డ కుటుంబాలు, పంట పెట్టుబడికి తిప్పలు, పట్టని ప్రభుత్వాలు ఇలా ప్రతి విషయాన్నీ కండ్లకు కట్టినట్టు అర్థం చేయిస్తున్నారు.
అలాగే, నాడు అంధకారంలో ఉన్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ వెలుగుల్లోకి తేవడం, సమైక్య రాష్ట్రంలో యాభై ఎనిమిదేండ్లు పరిష్కారం కాని విద్యుత్ సమస్యను కేవలం ఒకటి రెండేళ్లలోనే పరిష్కరించడం, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులతోపాటు అన్నివర్గాలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం, దీని ద్వారా రైతులకు జరుగుతున్న ప్రయోజనం గురించి శిబిరాల్లో వివరిస్తున్నారు. అలాగే, పెట్టుబడి కోసం నాడు పడ్డ ఇబ్బందులు, నేడు రైతు బంధుతో జరుగుతున్న మేలును వివరిస్తున్నారు. ఇవేకాదు, ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమా, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పంట రుణమాఫీ, దళితబంధు, మిషన్కాకతీయ, ధాన్యం కొనుగోలు, ఆసరా పెన్షన్లు.. వాటితో ఆయా వర్గాలకు జరుగుతున్న మేలు, లబ్ధిదారులు జీవితాల్లో నిండుతున్న వెలుగుల గురించి సవివరంగా శిక్షణ ఇస్తున్నారు.
అమ్మ ఒడి, నేతన్న బీమా, గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, వైకుంఠధామాలు, ఆరోగ్యలక్ష్మి, జిల్లాకో మెడికల్ కాలేజీ, ధరణి, పట్టణ, పల్లెప్రగతి, వాటి ద్వారా సాధించిన విజయాలు, పంచాయతీలుగా మారిన తండాలు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం పథకం.. ఇలా ప్రతి పథకం గురించి వివరించేలా శిక్షణ అందిస్తున్నారు. దశాబ్ధాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిషన్భగీరథ అమలవుతున్న తీరు, జిల్లాలకు విస్తరిస్తున్న ఐటీ రంగం.. దాని ద్వారా స్థానిక యువతీయువకులకు సమకూరుతున్న ప్రయోజనాలు గురించి చెబుతున్నారు. మండలాలవారీగా ఇస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలు వేములవాడ నియోజకవర్గంలో రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని వినోద్కుమార్ తెలిపారు. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా గులాబీ సైన్యాన్ని తీర్చిదిద్దుతున్నామని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
క్షేత్రస్థాయిలో గులాబీ సైన్యాన్ని ప్రచారం కోసం పూర్తి స్థాయిలో దింపేందుకు బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు 7.12 లక్షల సభ్యత్వం ఉండగా, వారిని సైనికుల్లా తీర్చిదిద్దుతున్నది. నిజానికి గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు ఎప్పుడు చేపట్టినా అనూహ్య స్పందన వస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మద్దతు పెరుగుతున్నది. 2017-18లో సభ్యత్వ నమోదు లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 3.90 లక్షలు కాగా, అప్పుడు లక్ష్యానికి మించి 6.14 లక్షలు అయింది. తిరిగి 2021 ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు చేపట్టగా, సభ్యత్వం 7.12 లక్షలకు పెరిగింది. 13 నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గంలోనూ యాభై వేలకు తగ్గకుండా సభ్యత్వం నమోదైంది. వీరందరికీ పార్టీ పరంగా ఇన్సూరెన్స్ కూడా వర్తింప జేస్తున్నారు. సభ్యత్వం తీసుకున్న శ్రేణులకు అనుకోని సంఘటన ఏమైనా జరిగితే బీమా ద్వారా లబ్ధి కల్పిస్తున్నారు. అయితే, రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా నమోదు కాగా, ఇక్కడ 1,03,075 మంది సభ్యత్వం తీసుకున్నారు. అలాగే, మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యాభై నుంచి 60 వేల మధ్య నమోదు చేశారు. తాజాగా, ఎన్నికల వేళ ఉత్సాహంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను రంగంలోకి దింపుతున్నారు.